స్టాలిన్ని పిలిచి అవమానించారు, జయ ఈ జన్మలో మారదు: కరుణానిధి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పైన మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి సోమవారం నాడు నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష డీఎంకేను జయలలిత అవమానించారని ఆయన ధ్వజమెత్తారు.
తాము అసెంబ్లీ ఎన్నికల్లో 89 స్థానాల్లో గెలిచామని చెప్పారు. కానీ ప్రతిపక్ష నేతలను జయలలిత అవమానించారన్నారు. తన తనయుడు, ఎమ్మెల్యే స్టాలిన్కు వెనుకవరుసలో సీటు కేటాయించడం సరికాదని కరుణానిధి అన్నారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్కు ముందు వరుసలో సీటు కేటాయించారన్నరు. కానీ స్టాలిన్కు మాత్రం వెనుక వరుసలో సీటు కేటాయించారని విమర్శించారు. జయ ఆలోచన సరళి ఇక ఈ జన్మకు మారదని ఎద్దేవా చేశారు.
కరుణానిధి అంతకుముందు ఆదివారం మాట్లాడుతూ... తమిళనాడు శాసనసభలో మంచి ప్రతిపక్షంగా ప్రజల సమస్యల పరిష్కార దిశగా పని చేస్తామన్నారు. పదిహేనవ శాసనసభ ఎన్నికల్లో కూటమి పార్టీలు పోటీ చేసిన 60 స్థానాలకు 51 స్థానాల్లో ఓడిపోయాయని, కూటమి పార్టీలకు అత్యధిక స్థానాలను కేటాయించడమే డీఎంకే ఓటమికి కారణమని ఓ తమిళ పత్రిక తెలిపిందన్నారు.
డీఎంకే పోటీ చేసిన స్థానాల్లో ఓటర్ల మద్దతు ఏమాత్రం తగ్గలేదనే కోణంతో దీన్ని తాను చూస్తున్నానని చెప్పారు. 176 స్థానాల్లో పోటీ చేసిన డీఎంకేకు 41.05 శాతం, 232 స్థానాల్లో పోటీ చేసిన అన్నాడీఎంకేకు 40.78 శాతం ఓట్లు వచ్చినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించిందన్నారు.
2011 ఎన్నికలతో పోల్చుకుంటే అన్నాడీఎంకే కూటమికి 14.64 లక్షల ఓట్లు తక్కువగా రాగా డీఎంకే కూటమికి 36.61 లక్షలు ఓట్లు ఎక్కువగా వచ్చాయన్నారు. అప్పట్లో డీఎంకే 23 స్థానాలు గెలుచుకోగా ప్రస్తుత ఎన్నికల్లో 89 స్థానాలు గెలుచుకుందన్నారు.
గత ఎన్నికలతో పోలిస్తే సుమారు నాలుగింతలు సభ్యుల సంఖ్య పెరిగిందన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే 150 స్థానాల్లో గెలవగా ప్రస్తుతం 134 స్థానాల్లో గెలిచిందని, ఆ విధంగా చూస్తే నిజమైన విజయం ఎవరిదని ప్రశ్నించారు.
అన్నాడీఎంకే అభ్యర్థులు రెండు నియోజకవర్గాల్లో 100 ఓట్లు కన్నా తక్కువ తేడాతో, ఎనిమిది నియోజకవర్గాల్లో 101 నుంచి 1,000లోపు తక్కువ ఓట్లతో, 21 నియోజకవర్గాల్లో 1001 నుంచి 5వేల లోపు ఓట్ల తేడాతో, 22 నియోజకవర్గాల్లో 5001 నుంచి 10వేల లోపు ఓట్ల తేడాతో గెలిచారన్నారు. ఈ గణాంకాలను చూస్తుంటే ఈ ఎన్నికల్లో డీఎంకేకు ప్రజామద్దతు పెరిగిందనే విషయం స్పష్టమవుతోందన్నారు.