డీఎంకే చీఫ్ గా స్టాలిన్ ! అన్నాడీఎంకేకి షాక్
డీఎంకే చీఫ్ గా స్టాలిన్ ! అన్నాడీఎంకేకి షాక్
చెన్నై: డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కురుణానిధి (92) అనారోగ్యంతో కావేరీ ఆసుపత్రిలో చేరడంతో ఆయన త్వరగా కోలుకోవాలని డీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు.
ఇదే సమయంలో డీఎంకే పార్టీ పగ్గాలు కరునానిధి కుమారుడు ఎంకే. స్టాలిన్ కు అప్పగించాలని డీఎంకే నాయకులు నిర్ణయించారు. డీఎంకే చీఫ్ కరుణానిధి కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పార్టీ కార్యకలాపాలు చూసుకోవడానికి స్టాలిన్ కు అధికారం ఇవ్వాలని పార్టీ నాయకులు అంటున్నారు.
స్టాలిన్ ను డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కరుణానిధితో కలిసిన ఆయన కుమారులు ఎంకే. స్టాలిన్, అళగిరి (పెద్ద కుమారుడు) ఇటీవల పార్టీ విషయంపై సుదీర్ఘంగా చర్చించారు.
డీఎంకేలో అళగిరి స్థానం ఎలా ఉన్నా స్టాలిన్ మాత్రం పార్టీలో నెంబర్ టూగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 20వ తేదీన డీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని గత శనివారం స్టాలిన్ స్వయంగా ప్రకటించారు.
ఈనెల 20వ తేదీన జరిగే సమావేశంలో స్టాలిన్ డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా భాద్యతలు స్వీకరిస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. అస్వస్థతకు గురైన కరుణానిధి కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.
ఇటీవలే ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని కరుణానిధికి సూచించారు. అయితే గురువారం అర్దరాత్రి దాటిన తరువాత కరుణానిధి మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని కావేరీ ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.