స్టాలిన్ సవాల్ : బీజేపీతో జతకట్టడమా..నిరూపించండి..రాజకీయ సన్యాసం తీసుకుంటా
చెన్నై: ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ స్టాలిన్ను కలిసిన సంగతి తెలిసిందే. అయితే తాను ఫెడరల్ ఫ్రంట్తో ప్రయాణించబోనని తన ప్రయాణం కాంగ్రెస్తోనే కొనసాగుతుందని డీఎంకే చీఫ్ స్టాలిన్ స్పష్టం చేశారు. తాజాగా స్టాలిన్ బీజేపీతో బేరసారాలు ప్రారంభించారని తమిళనాడు బీజేపీ చీఫ్ తమిలిసాయి సౌందర్ రాజన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే స్టాలిన్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే చీఫ్ స్టాలిన్ను కలిశాక ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే స్టాలిన్ పై బీజేపీ చీఫ్ తమిలిసాయి సౌందర్ రాజన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ బీజేపీతో కలిసే అవకాశం ఉందని ఆమె అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత స్టాలిన్ పార్టీ డీఎంకే ఎన్డీయేతో కలుస్తుందనే వ్యాఖ్యలు చేశారు. అప్పుడే బీజేపీతో చర్చలు ప్రారంభించారనే కామెంట్స్ చేశారు.
తమిలసాయి సౌందర్రాజన్ చేసిన వ్యాఖ్యలపై స్టాలిన్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. తాను బీజేపీతో చర్చలు జరిపినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్టాలిన్ సవాల్ విసిరారు. ఇప్పటికే తమ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రతిపాదించిన తొలి పార్టీ డీఎంకే అని గుర్తు చేశారు. తన సవాల్ను స్వీకరించాల్సిందిగా ప్రధాని మోడీకి, తమిలిసాయి సౌందర్ రాజన్కు సవాల్ విసిరారు.
మోడీ, బీజేపీలను ఒక ఫాసిస్ట్గా అభివర్ణించిన మొట్ట మొదటి పార్టీ డీఎంకే అని గుర్తు చేశారు స్టాలిన్. దేశానికి మోడీ చేసింది ఏమీ లేదని విరుచుకుపడ్డారు. ఏమీ చేయకపోగా ప్రజలను ఇబ్బందిపాలు చేశారని స్టాలిన్ ధ్వజమెత్తారు. మోడీకి వ్యతిరేకంగా ఒక్క తమిళనాడులోనే కాదు, కోల్కతా, న్యూఢిల్లీలో కూడా ప్రచారం నిర్వహించానని చెప్పుకొచ్చారు. తెరవెనక ఉండి అన్నాడీఎంకే, బీజేపీల్లా రాజకీయాలు చేయమని స్టాలిన్ స్పష్టం చేశారు.మే 23 తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని జోస్యం చెప్పారు. ఆ పరిస్థితి ఉంటే బీజేపీతో డీఎంకే ఎందుకు చర్చలు జరుపుతుందని ప్రశ్నించారు.