విశాల్ నామినేషన్ తిరస్కరణ కుట్రే, కుమ్ముక్కు: స్టాలిన్
చెన్నై: హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణపై ప్రతిపక్ష డిఎంకె నేత స్టాలిన్ తీవ్రంగా ప్రతిస్పందించారు. విశాల్ నామినేషన్ను తిరస్కరించే విషయంలో భారత ఎన్నికల కమిషషన్ పాలక పార్టీతో కమ్ముక్కయిందని ఆయన ఆరోపించారు.
ఆర్కె నగర్ ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ ఇంచార్జీని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాల్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంర పాలక అన్నాడియంకె దురాగతాలకు నిదర్శమని అన్నారు.
ఆర్కె నగర్పై కుట్ర చేస్తున్నారని...
ఆర్కే నగర్లో తమ పార్టీకి విజయం సాధించే అవకాశాలుండటంతో ఉప ఎన్నికను మరోసారి రద్దు చేయడానికి పాలకవర్గం కుట్ర పన్నుతోందని స్టాలిన్ సంచలన ఆరోపించారు. గురువారం ఉదయం తన నియోజకవర్గమైన కొళత్తూరులోని ఎనిమిది ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. మడుమా నగర్లోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోటుపుస్తకాలను పంపిణీ చేశారు.
మంత్రులే డబ్బులు పంచిపెట్టారు...
గత ఏప్రిల్లో ఆర్కే నగర్ నియోజకవర్గంలో రాష్ట్రమంత్రులే రూ.89 కోట్ల దాకా ఓటర్లకు నగదు పంచిపెట్టారని, మంత్రి విజయభాస్కర్ నివాస గృహలు, కార్యాలయాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆధారపత్రాలలో వెల్లడైనా కేంద్ర ఎన్నికల సంఘం ఏ మాత్రం పట్టించుకోలేదని స్టాలిన్ ఆరోపించారు. మంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎన్నికలను రద్దు చేసిందన్నారు.
విశాల్ నామినేషన్ తిరస్కరణతోనే..
హీరో విశాల్ నామినేషన్ ఉదంతంలోనే ఎన్నికల అధికారులు అధికార పక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతుందని స్టాలిన్ అన్నారు. విశాల్ నామినేషన్పై ఒకే రోజు మూడు రకాల నిర్ణయాలు ప్రకటించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పాలకపక్షం అడుగులకు మడుగులొత్తు తున్నారనే సందేహం కూడా కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే..
విశాల్ నామినేషన్ వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోకపోతే ఆర్కే నగర్ ఎన్నికలు న్యాయబద్ధంగా జరుగుతాయా అనే సందేహం వస్తుందని స్టాలిన్ అన్నారు. విశాల్కు న్యాయం చేయకపోతే ఈ ఎన్నికపై నమ్మకం పోవడం ఖాయమని ఆయన అన్నారు.