22సార్లు పొడిచి హత్య: ప్రేమించుకున్నామన్న నిందితుడు, మరో వ్యక్తితో..
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం నాడు ఉపాధ్యాయురాలు కరుణను ప్రేమించలేదనే కారణంతో చంపిన ఘటన పైన కేంద్రం నివేదిక కోరింది. నిన్న ఉపాధ్యాయురాలిని సురేందర్ అనే యువకుడు దారుణంగా 22సార్లు పొడిచి చంపిన విషయం తెలిసిందే.
ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాల్లోను లభ్యమైంది. బుధవారం నాడు కేంద్రం దీని పైన ఢిల్లీ పోలీసులను నివేదిక అడిగింది.
కాగా, ఈ ఘటన పైన ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో శాంతిభద్రతలు కరువయ్యాయని మండిపడింది.
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. తాము ఢిల్లీ పోలీసు కమిషనర్ నుంచి నివేదిక కోరామని చెప్పారు. ఈ సంఘటన చాలా బాధాకరమన్నారు.
మరోవైపు, ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చీఫ్ స్వాతి మలీవాల్ ఓ ట్వీట్ చేశారు. గత ఏడాది మీనాక్షిని బహిరంగంగా చంపేశారని, ఇప్పుడు ఈమెను 22సార్లు పొడిచి చంపేశారని, ఇది సిగ్గుచేటు అని, భయం లేకుండా పోతోందని, ఇలాంటి వారిని ఉరివేసే వరకు మార్పు రాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, నిందితుడు సురేందర్ను స్థానికులు పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో అతను పలు విషయాలు చెప్పాడని తెలుస్తోంది. కరుణా, తాను ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నామని సురేందర్ తెలిపాడని తెలుస్తోంది.
పెళ్లి ప్రతిపాదనన ఆమె కుటుంబం తిరస్కరించిందని, మరొకరితో పెళ్లి చేయాలని చూస్తున్నారని చెప్పాడని సమాచారం. కరుణ మరో వ్యక్తితో కలిసి ఉన్న ఫటోను ఓ వ్యక్తి సురేందర్కు పంపించాడని తెలుస్తోంది. దీంతో అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చునని అంటున్నారు. కాగా దాడి సమయంలో సురేందర్తో పాటు మరో వ్యక్తి వచ్చాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.