శశికళ 'సీఎం' కాకుండా ఆపండి: హడావుడి ఎందుకని సుప్రీం కోర్టు
అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో శుక్రవారం నాడు ఊరట లభించింది. శశికళ ముఖ్యమంత్రి కాకుండా ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటిషన్ను సుప్రీం తిరస్కరించింది.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో శుక్రవారం నాడు కొంత ఊరట లభించింది. శశికళ ముఖ్యమంత్రి కాకుండా అత్యంత ప్రాధాన్యతా క్రమంలో విచారణ జరిపి, సీఎం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటిషన్పై సుప్రీంలో చుక్కెదురయింది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాల్సినంత హడావుడి ఏమీ పిటిషన్లో కనిపించడం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
గవర్నర్ ఏం చేస్తారు?: శశికళకే ఎక్కువ ఛాన్స్, పన్నీరు వైపు వారి మొగ్గు
జయలలిత అక్రమాస్తుల కేసు పైన తీర్పు వెలువడే వరకు ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా చూడాలని పిటిషన్ దాఖలైంది. దానిపై హడావుడిగా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే తేదీని ఖరారు చేయలేదని కూడా న్యాయస్థానం పేర్కొంది. అలాంటప్పుడు పిటిషన్ ముందుగా వేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
కాగా, చెన్నైకి చెందిన సెంథిల్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది జిఎస్ మణి వాదనలు వినిపించారు. శశికళ సీఎంగా ప్రమాణం చేయడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నందున, ఆ కేసులో తీర్పు వచ్చే వరకు శశికళ సీఎంగా ప్రమాణం చేయకుండా నిరోధించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ ముందు వాదనలు వినిపించారు.
ఒకవేళ ఆమెను ఆస్తుల కేసులో నిందితురాలిగా ప్రకటిస్తే రాజీనామా చేయాల్సి వస్తుందని, దీంతో సంక్షేభ పరిస్థితులు ఏర్పడతాయన, అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. దీనిపై జస్టిస్ ఖేహార్ ధర్మాసనంలోని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూద్లతో సంప్రదించిన మీదట తక్షణం విచారించేందుకు నిరాకరించారు.
తమిళనాడులో రసవత్తర రాజకీయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మధ్య ఆధిపత్యం, పదవి కోసం పోరు కొనసాగుతోంది. గురువారం వారు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును కూడా కలిశారు.