స్టాలిన్ మాతో రావలెన్..!కాదు..కాదు మా వాదన వినవలెన్..! కేసీఆర్ డీఎంకే నేత భేటీతో సాధించిందేంటి..!
హైదరాబాద్ : వారం రోజుల చర్చలు.. మూడు రోజుల ఉత్కంఠ.. నలభై ఎనిమిది గంటల టెన్షన్.. సస్పెన్స్ థ్రిల్లర్ ను మరిపించిన ఎపిసోడ్.. స్టాలిన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు భేటీ.. ఫెడరల్ ఫ్రంట్ గురించి కీలక చర్చలు అంటూ ఊదరగొట్టిన మీడియా.. స్టాలిన్ తో భేటీ తర్వాత ఏం మాట్లాడారో ఎక్కడా చిన్న ఊసేలేదు. పుష్ప గుచ్చాలు ఇవ్వడానికో, శాలువాలు కప్పడానికో ఇంత ప్రయాస ఎందుకనే చర్చ కూడా జరుగుతోంది. ఆళ్వార్పేటలోని తన నివాసానికి చేరుకున్న చంద్రశేఖర్ రావు కు స్టాలిన్ పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానం పలికారు. గంట పాటుగా స్టాలిన్ నివాసంలో చంద్రశేఖర్ రావు గడిపారు. అక్కడ జాతీయ, రాష్ట్ర రాజకీయాల మీద చర్చ సాగినట్టు ఊహాగానాలు చెలరేగాయి. ప్రాంతీయ పార్టీల ఏకం ప్రస్తావనను ఈ సందర్భంగా స్టాలిన్ ముందు చంద్రశేఖర్ రావు ఉంచినట్టు తెలిసింది. అయితే, ప్రస్తుతానికి జాతీయ రాజకీయాల కన్నా, తమిళనాట అన్నాడీఎంకే సర్కారును కూలదోయడం, అందుకు తగ్గట్టుగా స్పీకర్ మీద తాము జారీ చేసి ఉన్న అవిశ్వాస తీర్మానికి తగ్గ నోటీసు ప్రస్తావనను స్టాలిన్ తీసుకొచ్చినట్టు తెలిసింది.
స్టాలిన్ తో భేటీ వల్ల ఒరిగిందేమీ లేదంటున్న విశ్లేషకులు..! పెరిగిన విమర్శలు జోరు..!!
22 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అంశాన్ని చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అలాగే, కాంగ్రెస్తో కలసి తమిళనాట తాము ఎన్నికల్ని ఎదుర్కొన్న దృష్ట్యా, తమిళనాట ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం తమకు ఉందని, ప్రస్తుతానికి జాతీయ ప్రస్తావన వద్దన్నట్టు స్టాలిన్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. చివరకు లోక్సభ ఎన్నికల ఫలితాల మేరకు తదుపరి చర్చించుకుందామన్నట్టుగా ఇద్దరు నేతలు సంకేతాల్ని ఇచ్చుకున్నట్టుగా డీఎంకే నేత ఒకరు పేర్కొన్నారు.
వెల్లువెత్తుతున్న విమర్శలు..! ప్రాధాన్యతలేని భేటీగా వర్ణిస్తున్న రాజకీయ వర్గాలు..!!
ఈ సమావేశానంతరం చంద్రశేఖర్ రావు, స్టాలిన్లు మీడియా ముందుకు వస్తారన్న ప్రచారం సాగింది. దీంతో ఆళ్వార్ పేట నివాసం వద్ద మీడియా హడావుడి పెరిగింది. అయితే, చంద్రశేఖర్ రావు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లి పోయారు. స్టాలిన్ సైతం మీడియా ముందుకు రానప్పటికీ కాసేపటి తర్వాత తమ మధ్య సంప్రదింపులు, సమాలోచన కేవలం మర్యాద పూర్వకం మాత్రమేనని స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. చంద్రశేఖర్ రావు -స్టాలిన్ల మధ్య భేటీ సమయంలో మీడియాలో విమర్శలు, ఆరోపణలు జోరుగానే సాగాయి. అన్నాడీఎంకే తరఫున మంత్రి జయకుమార్ పేర్కొంటూ, కాంగ్రెస్ను బెదిరించి దారిలోకి తెచ్చుకోవడమే కాదు.ఇప్పట్లోనే తన గుప్పెట్లోకి తీసుకునే వ్యూహంతో స్టాలిన్ ఉన్నట్టు ఆరోపించారు.
తమిళనాడు రాజకీయాల్లో భిన్న వాదనలు..! వ్రుధా ప్రయాసగా అభివర్ణించిన సౌందర రాజన్..!!
అలాగే, చంద్రశేఖర్ రావు ద్వారా బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నట్టుగా తమకు సమాచారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తే తమకు ఐదు కేబినెట్ సీట్లు ఇవ్వాలన్న డిమాండ్ను చంద్రశేఖర్ ద్వారా ద్వారా ఢిల్లీకి చేరవేయడానికి వ్యూహరచన చేసి ఉన్నట్టు వ్యాఖ్యానించారు. బీజేపీ అధ్యక్షుడు తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ సర్కారు మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, అవన్నీ వృథా ప్రయత్నాలేనని వ్యాఖ్యానించారు.
రాహుల్ ని ప్రధానిని చేసేందుకు సహకరించండి..! కేసీఆర్ కి స్టాలిన్ సూచన..!!
ఇక, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి మాట్లాడుతూ మూడో ఫ్రంట్టో, ఫెడరల్ ఫ్రెంటుకో దేశంలో ఆస్కారం లేదన్నారు. డీఎంకే తన స్పష్టతను ఎప్పుడో తెలియజేసి ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలన్నారు. చంద్రశేఖర్ రావు ఓ రాష్ట్రానికి సీఎం అని, ఆయన తనతో భేటీకి వస్తున్నారని చెప్పగానే, తిరస్కరించే మనస్తత్వం స్టాలిన్కు లేదన్నారు. ఎవరు వచ్చినా ఆహ్వానించి, గౌరవించడం తమిళనాడు సంప్రదాయం అని, అదే స్టాలిన్ చేశారన్నారు. స్టాలిన్ను ప్రాంతీయ పార్టీల ఏకం విషయంగా చంద్రశేఖర్ రావు ఆహ్వానించి ఉన్న పక్షంలో, అందుకు తగ్గ సమాధానాన్ని స్టాలిన్ ఇచ్చి ఉంటారన్నారు. రాహుల్ను ప్రధాని చేయడానికి తమతో కలిసి రావాలన్న ఆహ్వానాన్ని స్టాలిన్ చంద్రశేఖర్ రావుకి పంపినా పంపి ఉండవచ్చని చమత్కరించారు.