రూ. 33 వేల కోట్ల స్కాం: అబ్దుల్ కరీంలాలా తెల్గీ అంత్యక్రియల్లో గొడవ, అడ్డుకున్న కుమార్తె!
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన రూ. 33 వేల కోట్ల రూపాయల విలువైన నకిలీ స్టాంప్ పేపర్ల స్కాం కేసు ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీంలాలా తెల్గీ మృతదేహాన్ని అతని సొంత ఊరు అయిన బెళగావిలోని ఖానాపురకు తరలించారు. అంత్యక్రియల సందర్బంగా కుటుంబ సభ్యుల మధ్య పెద్ద గొడవ జరిగిందని తెలిసింది.
రూ. 33 వేల కోట్ల స్కాం: కరీంలాలా తెల్గీ చచ్చాడు: పట్టించిన వ్యక్తికి అందని రూ. 44 కోట్ల బహుమానం!
అబ్దుల్ కరీంలాలా తెల్గీ మృతదేహం ముందు కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. కరీంలాలా తెల్గీ అంత్యక్రియలకు అతని సోదరుడు వెళ్లారు. ఆసందర్బంలో అబ్దుల్ కరీంలాలా తెల్గీ కుమార్తె సనా చిన్నాన మీద మండిపడ్డారు. విక్టోరియా ఆసుపత్రిలో అబ్దుల్ కరీంలాలా తెల్గీ చికిత్స పొందుతున్న సమయంలో ఒక్కసారి కూడా ఎందుకు రాలేదని సనా ప్రశ్నించారు.
చిన్నాన అంత్యక్రియల్లోపాల్గొనడానికి వీల్లేదని సనా పట్టుబట్టింది. విధిలేని పరిస్థితుల్లో అబ్దుల్ కరీంలాలా తెల్గీ సోదరుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 17 ఏళ్ల నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ కరీంలాలా తెల్గీ తీవ్ర అనారోగ్యంతో అక్టోబర్ 16వ తేది విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు.
ఐసీయూలో చికిత్స పొందుతున్నఅబ్దుల్ కరీంలాలా తెల్గీ చికిత్స విఫలమై అక్టోబర్ 26వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. అబ్దుల్ కరీంలాలా తెల్గీతో పాటు రూ. 33 వేల కోట్ల విలువైన నకిలీ స్టాంప్ పేపర్ల స్కాంలోని పచ్చి నిజాలు సైతం చచ్చిపోయాయి. ఈ స్కాంలోని అనేక మంది ప్రముఖులు ఇప్పుడు ఊపిరిపీల్చుకున్నారు.