ఉగ్రవాదంపై భారత్తో కలిసి పోరాటం చేస్తాం: సౌదీ రాజు సల్మాన్
ఢిల్లీ: సౌదీ అరేబియా భారత్కు వ్యూహాత్మకమైన భాగస్వామి అని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్తో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ హౌజ్లో సమావేశమయ్యారు. సౌదీ అరేబియా భారత్కు మంచి మిత్రదేశంగా అభివర్ణించిన ప్రధాని మోడీ... ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలోపేతం అయ్యిందని వెల్లడించారు. మరోవైపు భారత మానవవనరుల అభివృద్ధి కోసం సౌదీ పెట్టుబడులను స్వాగతిస్తున్నామని ప్రధాని చెప్పారు.
ఇక ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై కూడా చర్చించారు ఇరునేతలు. పుల్వామా ఘటన ప్రపంచదేశాలకు కూడా ప్రమాద సంకేతాలు పంపిందని అన్నారు ప్రధాని. ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్న దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో సౌదీ అరేబియా సహకారం అందిస్తుందని చెప్పారు ప్రధాని మోడీ.
ప్రధాని మోడీ ప్రకటన తర్వాత సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడారు. ఉగ్రవాదం, వేర్పాటు వాదం అనేవి ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న అంశాలు అని సల్మాన్ చెప్పారు. భారత్కు ఈ సమయంలో తప్పకుండా అండగా నిలుస్తామనే భరోసా ఇచ్చారు సల్మాన్. మరోవైపు భారత్తో ఇంటెలిజెన్స్ సమాచారం కూడా పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సల్మాన్ చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఒక్క భారత్కే కాదు ఇతర దేశాలకు కూడా అండగా నిలుస్తామని వారితో కలిసి పోరాడుతామని సల్మాన్ చెప్పారు.
ఇక సౌదీ అరేబియా భారత్ల మధ్య స్నేహం ఈ నాటిది కాదని కొన్ని వేల సంవత్సరాల నుంచే ఇది కొనసాగుతోందని గుర్తు చేశారు సల్మాన్. గత 50 ఏళ్లుగా ఈ రెండు దేశాల మధ్య బంధం క్రమంగా బలోపేతం అవుతూ వస్తోందని చెప్పారు. ఆయిల్, వ్యవసాయం, సాంకేతికత రంగాల్లో భారత్, సౌదీ అరేబియాలది ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాయని సల్మాన్ తెలిపారు. వివిధ సమస్యల పరిష్కారానికి ఒకే ప్రణాళికతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు సల్మాన్. 2016లో ప్రధాని మోడీ సౌదీ అరేబియాలో పర్యటించారని... ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్లో సౌదీ అరేబియా 44 బిలియన్ అమెరికా డాలర్లను పెట్టుబడిగా పెట్టిందని గుర్తుచేశారు.
ఇక చివరిగా సమావేశం తర్వాత భారత్ సౌదీ అరేబియాలు ఐదు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో మానవవనరులు, గృహనిర్మాణ సహకారం, బ్రాడ్కాస్టింగ్ రంగాలు ఉన్నాయి.