థియేటర్లలో జాతీయగీతం: బలవంతం చేయలేమన్న సుప్రీం
Recommended Video
న్యూఢిల్లీ: సినిమా థియేటర్లలో జాతీయ గీతం సందర్భంగా తప్పకుండా నిల్చోవాల్సిందేననే నిబంధనకు సుప్రీంకోర్టు సవరణ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు కచ్చితంగా లేచి నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
సినిమా వేయడానికి ముందు జాతీయగీతం ప్రసారానికి సంబంధించిన నిబంధనలను సవరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి సూచించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు.
తప్పనసరి కాదు..
అంతేగాక, తమ ఉత్తర్వుల్లో పదాన్ని ‘తప్పనిసరి' బదులు ‘చేయొచ్చు' అని మార్చేందుకు సిద్ధమని తెలిపింది. తమ భుజాలపై దేశభక్తిని మోయాలని పౌరులను బలవంతం చేయలేం, కోర్టులు తమ ఉత్తర్వుల ద్వారా దేశభక్తిని ఉపదేశించజాలవు అని వ్యాఖ్యానించింది.
దేశభక్తి లేదని కాదు.. ప్రభుత్వంపై సెటైర్లు..
సినిమా హాలులో జాతీయగీతం వస్తున్నప్పుడు లేచి నిలబడని వారికి దేశ భక్తి తక్కువ ఉందని అనుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. జాతీయగీతాన్ని అవమానపరిచేలా ఉన్నాయంటూ ప్రేక్షకులు థియేటర్లకు టీ-షర్టులు, నిక్కర్లు వేసుకురాకుండా రానున్న రోజుల్లో ప్రభుత్వం నిషేధాజ్ఞలు తీసుకొచ్చినా రావొచ్చని జస్టిస్ మిశ్రా వ్యంగ్యంగా అన్నారు. కేరళకు చెందిన కొడుంగళ్లూరు ఫిల్మ్ సొసైటీ వేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది.
వారి బాధ్యతే..
థియేటర్లలో సినిమాకు ముందు జాతీయగీతం తప్పనిసరిగా వేయాలనీ, ప్రేక్షకులు కచ్చితంగా లేచి నిలబడాలని గత నవంబరు 30న జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనమే తీర్పునిచ్చింది. తాజాగా, కోర్టు ఉత్తర్వుల ద్వారా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించలేమనీ, అది తల్లిదండ్రులు, గురువులు చేయాల్సిన పని అని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఏకరూపకత కోసమే..
కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదిస్తూ.. భారత్ భిన్న సంస్కృతుల దేశమని, ఏకరూపత తీసుకురావడానికి థియేటర్లలో జాతీయ గీతాలాపన అవసరమన్నారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికే ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.
ఎవరు ఆపుతున్నారు?
కాగా, జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. ‘ఫ్లాగ్ కోడ్ను సవరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? దానిని సవరించి జాతీయ గీతాన్ని ఎక్కడ ఆలపించాలి.. ఎక్కడ ఆలపించకూడదో చెప్పండి. ఈ రోజుల్లో ఆటలు, టోర్నమెంట్లు, ఒలింపిక్స్లోనూ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. వాటికి హాజరైనవారిలో సగానికి దాని అర్థం తెలియదు' అన్నారు. తదుపరి విచారణను వచ్చే జనవరి 9కి వాయిదా వేశారు. అప్పటిలోగా ఫ్లాగ్కోడ్ సవరణపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.