గుడ్ న్యూస్: స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగాల జాతర..లక్షల్లో జీతం,నియామకాల్లో ముందున్న ఫోన్పే..!
ఢిల్లీ: కరోనావైరస్ కారణంగా చాలా సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఎలాంటి వ్యాపారకార్యకలాపాల నిర్వహణ లేకపోవడంతో నష్టాల్లోకి కూరుకుపోయిన సంస్థలు తమ ఉద్యోగస్తులకు ముందస్తుగా వేతనం చెల్లించి వారిని కొలువు నుంచి తీసేశాయి. కొన్ని సంస్థలైతే చాలా ఇబ్బందిగా ఉందంటూ వేతనాలు కూడా చెల్లించకుండా ఉద్యోగస్తులను ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇదంతా లాక్డౌన్ సమయంలో ఆయా సంస్థలు తీసుకున్న నిర్ణయాలు. ఇక దేశం అన్లాక్ మోడ్లోకి రావడంతో తిరిగి ఉద్యోగ నియామకాలను చేపట్టాయి కొన్ని సంస్థలు.
స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగాలు
కరోనా మహమ్మారితో నియామకాలు నిలిపివేసిన ఆయా సంస్థలు తిరిగి నియామకాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా తమ వ్యాపారాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో స్టార్టప్ కంపెనీలు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ రిక్రూట్మెంట్లు ప్రారంభించాయి. బీ 2 బీ స్టార్టప్ కంపెనీలు అయిన సైన్జీ, రాపిడ్ డెలివరీ, రేజర్పే, క్యాష్ ఫ్రీ, సింప్లీలెర్న్, ఇన్స్టా మోజో మరియు ఫోన్పేలాంటి పేరుగాంచిన సంస్థలు ఉద్యోగస్తులను రిక్రూట్ చేసుకునేందుకు ముందుకొచ్చాయి. ఈ కంపెనీలన్నిటిలో కలిపి 1500 ఉద్యోగాలు ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ ప్రాడక్ట్ డెవలప్మెంట్, బిజినెస్ ఆపరేషన్, టెక్నాలజీ, అనలిటిక్స్, సేల్స్ మరియు మార్కెటింగ్ శాఖల్లో ఉన్నాయి. ఇక వీటిలో వేతనాలు కూడా తక్కువేం కాదు. ఏడాదికి రూ.10 లక్షల నుంచి ప్రారంభం కానుండగా ఇది రూ.40 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటాయని సమాచారం.
లాక్డౌన్లోనూ లాభాలు
స్విగ్గీ, ఓయో, క్యూర్ఫిట్ లాంటి సంస్థలు తమ ఉద్యోగస్తులను తొలగిస్తూ పింక్ స్లిప్పులు ఇస్తున్న నేపథ్యంలో ఈ స్టార్టప్ కంపెనీలు ఉద్యోగాలు కల్పించడం నిరుద్యోగులకు వరంగా మారిందని చెప్పొచ్చు. కోవిడ్-19 కారణంగా పేమెంట్ కంపెనీలు ఒక్కటే నష్టాల ఊబిలో కూరుకుపోలేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో ఈ సంస్థలు లాభాల బాటలో పయనించినందున మరింతగా తమ సేవలను విస్తరించేందుకు కొత్త రిక్రూట్మెంట్లను ప్రోత్సహిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఏ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు..?
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సైన్జీ సంస్థ బ్యాంకులకు , ఎన్బీఎఫ్సీలకు ఇతర ఆర్థిక సంస్థలకు పనిచేస్తుంది. ఈ సంస్థ తమ ప్రాడక్ట్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సేల్స్ టీమ్లలో 60 మందిని రిక్రూట్ చేసుకోవాలని భావిస్తున్నట్లు సహవ్యవస్థాపకులు అంకిత్ రతన్ చెప్పారు. రాపిడ్ డెలివరీ అనే లాజిస్టిక్స్ సంస్థ 500 మందిని నియమించుకోవాలని భావిస్తుండగా సింప్లీలెర్న్ అనే ఎడ్యుకేషన్ సంస్థ 300 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక ఇన్స్టామోజో రేజర్పే సంస్థలు 100 మందిని నియమించుకోవాలని భావిస్తున్నాయి. క్యాష్ ఫ్రీ 70 మంది ఉద్యోగస్తులను నియమించుకోవాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు రీజు దత్త చెప్పారు. ఇక ఫోన్పేలో ప్రస్తుతం 1800 మంది ఉద్యోగస్తులు పనిచేస్తుండగా మరో 360 మందిని రిక్రూట్ చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.