నేపాలీ స్త్రీలపై గ్యాంగ్ రేప్లో ట్విస్ట్: నీతూ ఇలా..
హైదరాబాద్: సౌదీ అరేబియా దౌత్యవేత్త నివాసంలో ఇద్దరు నేపాలీ మహిళల నిర్బంధం, అత్యాచారం విషయంలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. సౌదీ అరేబీయా దౌత్యవేత్త ఇంట్లో జీవితం అత్యంత దుర్భంగా ఉండేదని ఆ ఇంట్లో పనిచేసిన వంటమనిషి పశ్చిమ బెంగాల్లోని డార్జీలింగ్కు చెందిన నీతూ వెల్లడించింది. ఇద్దరూ నేపాలీ మహిళలతో పాటు తననూ నిర్భంధించారని ఆమె చెప్పింది. ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వయూలో ఆమె ఆ విషయాలు వెల్లడించింది.
సరిగా అన్నం కూడా పెట్టే వాళ్లు కాదని, తీవ్రం చిత్ర హింసలకు గురి చేశారని, సరిగ్గా సమయానికి తన భర్త ఫోన్ చేయడంతో ఎలాగోలా బయటపడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు రెండు రొట్టెలు మాత్రమే ఇచ్చేవారని చెప్పింది. కేరళకు చెందిన అన్వర్ పని చూపిస్తానని తనను గుర్గావ్ తీసుకెళ్లాడని, నెలకు 18వేల రూపాయల జీతానికి తనను సౌదీ దౌత్యవేత్త ఇంట్లో చేర్చాడని నీతూ చెప్పారు. అప్పటికే అక్కడ ఇద్దరు నేపాలీ పనిమనుషులు ఉన్నారని ఆమె తెలిపారు.
తెల్లవారుజామున నాలుగు గంటల వరకు పనిచేయించే వాళ్లని చెప్పింది. వారంలో ఒక రోజు సెలవు అని చెప్పారని, కానీ సెలవు ఇవ్వలేదని, వంట పనే కాక ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం వంటి పనులు కూడా చేయించేవాళ్లని చెప్పారు. కనీసం మాట్లాడుకోవడానికి కూడా తమకు అవకాశం కల్పించే వాళ్లు కాదని, తమను కలుసుకోనివ్వకుండా ముగ్గురికి వేరు వేరు గదులు కేటాయించారని తెలిపారు.
దీంతో అక్కడినుంచి పారిపోవాలని భావించామన్నారు. అయితే తమ ముగ్గురిని ఒక గదిలో బంధించి, చంపేస్తామంటూ రోజూ బెదిరించేవాళ్లన్నారు. ఇంతలో ఆగస్టు 23న తన భర్త తనకు ఫోన్ చేశారు. తాను ఫోన్ తీశానని, దీన్ని గమనించిన ఇంటి యజమాని, ఆయన భార్య వెంటనే కోపంగా నా దగ్గరి నుంచి ఫోన్ లాక్కున్నారని, చంపుతానని నన్ను బెదిరించారని చెప్పింది.
దీంతో తాను ఏ మాత్రం అక్కడ ఉండడని వాళ్లకు తెగేసి చెప్పానని నీతూ వివరించారు. వాళ్లు వెంటనే అన్వర్ను పిలిపించి మాట్లాడుతుండగా తన భర్త వచ్చి తనను తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. అక్కడ దాదాపు 25రోజులు పనిచేశానని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, దీనిపై తాను కోర్టుకు వెళతానని నీతూ వివరించింది.