ఘోరం: 4 రోజులకు ఓ బ్రెడ్.. రెండేళ్లుగా సోదరికి సోదరుడి చిత్రహింసలు
ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. ఓ సోదరుడు తన సోదరిని రెండేళ్ల పాటు ఇంట్లో బంధించి ఆమెకు ఆహారంగా నాలుగు రోజులకు ఓసారి బ్రెడ్ అందించాడు. ప్రస్తుతం రోజు రోజుకు మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పేందుకు ఇది మరో నిదర్శనంగా నిలిచింది.
ఈ సంఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధిత మహిళ వయస్సు దాదాపు 50 ఉంటుంది. రెండేళ్లుగా ఆమె తన మలమూత్రాల మధ్య టెర్రాస్ పైన పడి ఉంది. ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యులు, పోలీసులు ఆమెను కాపాడారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ హృదయవిదారక సంఘటన అందరినీ కదిలిస్తోంది.
కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్
రెండేళ్లుగా ఇలా వేధింపు
దీనిపై మహిళా సంఘం నాయకురాలు మాట్లాడుతూ... ఆ మహిళ తన సోదరుడి టెర్రాస్ పైన చాలా రోజులుగా పడి ఉందని, ఆమె పూర్తిగా బక్కచిక్కిపోయిందని చెప్పారు. సొంత సోదరుడే రెండేళ్లుగా ఆమెను ఒంటరిగా ఉంచి వేధించాడని చెప్పారు. ఆమె కనీసం మాట్లాడే పరిస్థితుల్లో, నడిచే పరిస్థితుల్లో లేదని చెప్పారు. కనీసం పక్కనున్న వారిని కూడా గుర్తించే స్థితిలో లేదని ఢిల్లీ మహిళా సంఘం నాయకురాలు స్వాతి మలివాల్ అన్నారు.
స్వాతి మలీల్ ట్వీట్
ఈ మేరకు స్వాతి మలీవాల్ ట్వీట్ చేశారు. యాభై ఏళ్ల మహిళ పట్ల సోదరుడు వ్యవహరించిన తీరు తనను షాక్కు గురి చేసిందని పేర్కొన్నారు. ఈ కారణంగా యాభై ఏళ్ల ఆ మహిళ 90ఏళ్లకు పైబడిన దానిలా కనిపిస్తోందన్నారు. ఆమె కనీసం తన ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉందన్నారు.
మరో సోదరుడు ఫిర్యాదు
దీనిపై చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేయకపోవడం బాధాకరమని స్వాతి అన్నారు. ఆమె శరీరం ఎముకలకు అంటుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి రెండో సోదరుడు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వెలుగు చూసింది. మానసిక వ్యాధఇతో బాధపడుతున్న బాధితురాలు తన తల్లితో కలిసి ఉండేది. తల్లి చనిపోయాక తర్వాత బాధ్యతలు తీసుకున్న సోదరుడు చిత్రహింసలకు గురి చేశాడు.
తలుపు తీయని భార్య
తన సోదరుడు ఆమెను రెండేళ్లుగా హింసిస్తున్నాడని, ఆమెను చూసేందుకు కూడా ఎవరినీ అనుమతించడం లేదని మరో సోదరుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తొలుత మహిళా కమిషన్ సభ్యులు ఇంటికి వెళ్లినప్పుడు సోదరుడి భార్య తలుపులు తెరిచేందుకు నో చెప్పింది. అధికారులను తిట్టింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయినప్పటికీ గేట్లు తీయకపోవడంతో పక్కనే ఉన్నభవనంపై నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. టెర్రస్పై పడి ఉన్న మహిళను రక్షించి ఆసుపత్రికి తరలించారు.