ట్రాఫిక్ జరిమానాలు రాష్ట్రాలు తగ్గించుకోవచ్చు: నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు వాహనాల చట్టం ద్వారా పెంచిన ట్రాఫిక్ జరిమానాల విధింపు, తగ్గింపుపై రాష్ట్రాలే సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగా పెరిగిన ట్రాఫిక్ జరిమానాలను గుజరాత్ ప్రభుత్వం మంగళవారం దాదాపు 90శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అలాగే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా కొత్త జరిమానాలను అమలు చేసే ఆలోచనలేదని స్పష్టం చేసింది. ఇదే విధంగా మరికొన్ని రాష్ట్రాలు కూడా ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల సవరించిన మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం పెరిగిన ట్రాఫిక్ జరిమానాలను రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకొనే వెసులుబాటు ఉంటుందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. కేంద్రం పెంచిన జరిమానాలు ఆదాయం పెంచుకోవడం కోసం కాదని.. ప్రజల భద్రత కోసమేనని కేంద్రమంత్రి తేల్చిచెప్పారు.
యువతా ఇది విన్నారా?: నిర్మలా సీతారామన్ 'మిలీనియల్స్ ' కామెంట్స్పై పేలుతున్న సెటైర్లు!
కాగా, యువత వాహనాల కొనుగోళ్లకు మొగ్గు చూపని కారణంగా ఆటో మొబైల్ రంగం మందగమనంలో సాగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ వివరణ ఇచ్చారు. వాహనాల అమ్మకాలు పడిపోయేందుకు ఇది కూడా ఓ కారణమని నిర్మలా సీతారామన్ చెప్పారని ఆయన తెలిపారు.