మాజీ ముఖ్యమంత్రి బంధువు కుమారిడి హత్య: సవతి తల్లే హంతకురాలు, ఆస్తి కోసమే!
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ సన్నిహిత బంధువు సిద్ధార్థ సింగ్ (28) హత్య కేసులో అతని సవతి తల్లి ఇందూ చౌహాన్ను అమృతహళ్లి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సిద్దార్థ తండ్రి దేవేందర్ సింగ్కు ఇందూ చౌహాన్ రెండో భార్య.
కాగా, తిరుపతికి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి, వినోద్లకు ఆమె కిరాయి ఇచ్చి సిద్ధార్థ్ను హత్య చేయించిందని విచారణలో తేలడంతో ఆమెను బెంగళూరు ఈస్ట్ డీసీపీ సీకే బాబా తెలిపారు. బుధవారం రాత్రే ఆమెను నిర్బంధించిన పోలీసులు, కోర్టు ముందు గురువారం ఉదయం హాజరుపర్చారు. అనంతరం అరెస్ట్ చేశారు.
జనవరి 19న సిద్దార్థ సింగ్ను కిడ్నాప్ చేసి, కారులోనే సీటు బెల్టుతో గొంతుకు ఉరివేసి హత్య చేశారు నిందితులు. అక్కడ్నుంచి నెల్లూరు జిల్లాకు తీసుకెళ్లి రాపూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారు. అంతేగాక, సిద్దార్థ సెల్ ఫోన్ నుంచి తాను అమెరికా వెళుతున్నట్లు నిందితులే అతని తండ్రికి మెసేజ్ చేశారు. ఫోన్ చేయకుండా మెసేజ్ చేయడం, ఫోన్ చేసినా అందుబాటులో లేకపోవడంతో.. అనుమానం వచ్చిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
కాగా, హత్యను ఛేదించిన పోలీసులు.. స్థానిక తహసీల్దారు సమక్షంలో సిద్దార్థ శవాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం చేశారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. వ్యక్తిగత కక్షలు, ఆస్తి కోసమే సిద్ధార్థను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తులో తేల్చారు.
అమెరికాలో చదువుకున్న సిద్ధార్థ అమృతహళ్లి పరిధిలోని దాసరహళ్లి అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉండేవారు. ఆయన ఒక స్టార్టప్ పరిశ్రమను నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. సిద్దార్థ హత్య వెనుక మరికొందరి హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.