స్టెరిలైట్ ఆందోళన ఎఫెక్ట్: 32వేల ఉద్యోగాలకు ఎసరు
చెన్నై: తుత్తూకూడిలో స్టెరిలైట్ ఫ్యాక్టరీని మైసివేయాలని ఆందోళన కొనసాగుతోంది. ఈ ఆందోళనల సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగిన పోలీసు కాల్పుల్లో సుమారు 13 మంది మృత్యువాత పడ్డారు. అయితే స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసివేయాలని కొనసాగుతున్న ఆందోళన కారణంగా సుమారు 32 వేల ఉద్యోగాలకు గండిపడనుంది.
స్టెరిలైట్ ఫ్యాక్టరీలో సుమారు 3500 మంది పనిచేస్తున్నారు. సుమారు 30 వేల మంది కార్మికులు పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే స్టెరిలైట్ ఫ్యాక్టరీతో కారణంగా రోగాల బారినపడుతున్నామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
అయితే ఫ్యాక్టరీ మరో యూనిట్ విస్తరణను కూడ స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఫ్యాక్టరీలో కేవలం వెయ్యి మందినే పనిలో ఉంచుకోవాలని యాజమాన్యం భావిస్తోందని సమాచారం. మిగిలిన వారిని తొలగించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు కొనసాగినంత కాలం ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి పరోక్షంగా జీవనం సాగిస్తున్న కార్మికులను కూడ పనిలో నుండి తొలగించాలని ఫ్యాక్టరీ యాజమాన్యం భావిస్తోందని సమాచారం.
కంపెనీ మరమ్మత్తుల కారణంగా మార్చి 27 నుండి ఫ్యాక్టరీని మూసివేసినట్టు యాజమాన్యం ప్రకటించింది. అయితే ఈ ఏడాది జూన్ నుండి ఫ్యాక్టరీని తిరిగి తెరవనున్నట్టు ప్రకటించింది. ఈ ఫ్యాక్టరీ కారణంగా ప్రజలు రోగాలబారిన పడుతున్నారనే ప్రచారాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం కొట్టిపారేస్తోంది.ఇదంతా తప్పుడు ప్రచారమని చెబుతున్నారు.