కొత్త ప్రశ్నలు వద్దు: ఎన్పీఆర్పై కేంద్రానికి సీఎం నితీష్ కుమార్ కీలక సూచనలు
పాట్నా: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామి అయిన బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కేంద్రానికి కీలక సూచనలు చేశారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను గతంలో నిర్వహించిన మాదిరిగానే ఇప్పుడు కూడా చేపట్టాలని కేంద్రాన్ని కోరారు.
ఎన్పీఆర్ సమాచార సేకరణలో భాగంగా పలు కొత్త ప్రశ్నలను చేర్చడం వల్ల ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. 2011లో ఎన్పీఆర్ను ఏ విధంగా అమలు చేశారో అలానే ఇప్పుడు కూడా చేయాలని ఆయన సూచించారు. ఇందులో కొత్త ప్రశ్నలు చేర్చకూడదని అన్నారు.
తల్లిదండ్రుల పుట్టిన తేదీలు అడగడం వంటివి చేస్తే ప్రజలు గందరగోళానికి గురవుతారని బీహార్ సీఎం వ్యాఖ్యానించారు. అందుకే పాత పద్ధతినే అనుసరించడం మంచిదని నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
కాగా, కొత్తగా నిర్వహించే ఎన్పీఆర్లో 21 కొత్త ప్రశ్నలను చేర్చనున్నారు. సదరు పౌరుడి ఆధార్ నెంబర్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, ఫోన్ నెంబర్, తల్లిదండ్రుల పుట్టిన తేదీ, ప్రదేశం, చివరిగా వాళ్లు ఎక్కడ నివసించార అనే ప్రశ్నలను అడగనున్నారు. ఈ వివరాలు సేకరించడం వల్ల ప్రయోజనమేంటని విపక్షాలు ప్రశ్నిస్తుండగా.. ప్రభుత్వానికి ప్రజల వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, వారికి అవసరమైన సంక్షేమ పథకాలు రూపొందించే సమయంలో ఈ వివరాలు ఉపయోగపడతాయని కేంద్రం చెబుతోంది.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు మద్దతు ప్రకటించిన బీహార్ సీఎం నితీష్ కుమార్.. తమ రాష్ట్రంలో మాత్రం జాతీయ పౌర నమోదు(ఎన్ఆర్సీ)ని మాత్రం అమలు చేయబోమని స్పష్టం చేశారు. తాము ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్పీఆర్పై కేంద్రంకు నితీష్ సూచనలు చేయడం గమనార్హం.
కాగా, మరో జేడీయూ నేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత్రం ఎన్ఆర్సీతోపాటు సీఏఏ, ఎన్పీఆర్లను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేగాక, కేంద్రంపై విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ నేతలకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేడీయూ అధినేత నితీష్ తీవ్రంగా స్పందించారు. జేడీయూ నుంచి వెళ్లిపోవాలనుకుంటే ఎవరూ ఆపరని ప్రశాంత్ కిషోర్కు తేల్చి చెప్పారు. అయితే, ప్రశాంత్ కిషోర్.. పార్టీని వీడతారా? లేక అధినేత ఆదేశాలను పాటిస్తూ కొనసాగుతారా? అనేది తేలాల్సి ఉంది.