పోలీసు వాహనాలకు నిప్పు, బస్సుల దహనం, లక్నోలో మిన్నంటిన సీఏఏ నిరసనలు, ఢిల్లీ, బెంగళూరులో కూడా..
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, లక్నోలో ఆందోళనకారులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు లాఠీచార్జీ ప్రయోగించి, బాష్పవాయువు ప్రయోగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఢిల్లీలో ఆందోళనలు ఎక్కువవడంతో ఔటర్ ఢిల్లీలో గల భావనలోని రాజీవ్ గాంధీ స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా మార్చారు. ఆందోళనకారులను తీసుకొచ్చారు.
ఢిల్లీతోపాటు బెంగళూరులో కూడా 144 సెక్షన్ విధించినా.. ఆందోళనలు మిన్నంటాయి. నిరసనకారులు తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కొందరు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో స్వరాజ్ ఇండియా అధినేత యోగేంద్ర యాదవ్ కూడా ఉన్నారు. హింసాత్మక ఘటనలతో ఢిల్లీలో 14 మెట్రో రైళ్లను అధికారులు రద్దుచేశారు. కోల్కతా, బెంగళూరు, లక్నోలో కూడా నిరసన జ్వాల ఎగసిపడుతోంది.
ఇటు లక్నోలో కూడా ఆందోళనకారులు రెచ్చిపోయారు. పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. టూ వీలర్ తగలబడుతున్న వీడియో స్థానిక టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. మరికొందరు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు లాఠీలు ఝులిపించారు. తర్వాత పరిస్థితి చేయిదాటడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు సాంబాల్ జిల్లాలో కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. యూపీ ప్రభుత్వానికి చెందిన బస్సులను ఆందోళనకారులు దగ్ధం చేశారు.