'నటించింది చాలు.. ఇక లేచి వెళ్లు': స్టెరిలైట్ వివాదం, పోలీసుల అమానుష వైఖరి!
తమిళనాడు: తూత్తుకుడి స్టెరిలైట్ కాపర్ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. మంగళవారం వారు జరిపిన కాల్పుల్లో 10మంది మృతి చెందగా, బుధవారం మరో ఇద్దరు మృతిచెందారు.
ఆందోళనకారుల పట్ల పోలీసులు ఎంత నిర్దయగా వ్యవహరిస్తున్నారో తెలియజెప్పేలా.. తాజాగా ఓ వీడియో తెర పైకి వచ్చింది. బుధవారం నాటి కాల్పుల్లో 'కాలియప్పన్' (22) అనే వ్యక్తి తుపాకీ తూటాకి కుప్పకూలగా.. 'నటించింది చాలు.. ఇక పైకిలే' అంటూ పోలీసులు వ్యాఖ్యానించడం గమనార్హం.
కాలియప్పన్ కుప్పకూలిన తర్వాత కొంతమంది పోలీసులు అతని చుట్టు గుమిగూడారు. కింద పడి ఉన్న అతన్ని లాఠీలతో పొడుస్తూ.. 'నటించి చాలు.. ఇక లేచి వెళ్లు' అంటూ కామెంట్ చేశారు. పక్కనున్న మిగతా పోలీసులు కూడా 'అతను నటిస్తున్నాడు..' అంటూ కామెంట్ చేశారు.
#Police says to an Fired and Injured man "Don't Act" #Sterliteprotest #Bansterlite #Thoothukudi 🔥 pic.twitter.com/vwy7mVwc6T
— Vikram VFC (@Vijayfans007) May 23, 2018
కానీ కాలియప్పన్ ను ఆసుపత్రికి తరలించేసరికే అతను మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు మాత్రం.. ఆందోళనకారులు రాళ్లు రువ్విన తర్వాతే తాము ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.
కాగా, మరో ఏఎన్ఐ విడుదల చేసిన మరో వీడియోలోనూ పోలీసుల ప్రవర్తన అత్యంత వివాదాస్పదంగా ఉంది. ఆందోళనకారులపై కాల్పులు జరిపేందుకు ఓ బస్సు పైకి ఎక్కిన పోలీసు తుపాకీ గురిపెట్టగా.. 'కచ్చితంగా ఒక్కడైనా చస్తాడు' అన్న గొంతు ఆ వీడియోలో వినిపించింది.
ఇదిలా ఉంటే, తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఐదు రోజుల పాటు అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది ప్రభుత్వం. ఆందోళనకారులు మాత్రం స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసివేసేదాకా పోరాడుతామని చెబుతున్నారు. ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల గ్రామాల్లోని నీళ్లు, గాలి పూర్తిగా కలుషితమై క్యాన్సర్ వ్యాప్తి చెందుతోందని వారు వాపోతున్నారు.