దేశంలో దాడులు తగ్గాలంటే గోమాంసం తినడం మానేయాలి: ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్
దేశంలో జరుగుతున్న ఆటవిక దాడులపై ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఇంద్రేశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు గోమాంసంను తినడం ఆపేస్తే దాడులు వాటంతకవే తగ్గుముఖం పడుతాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏ ఒక్క మతం కూడా గోవును చంపమని ఎక్కడా చెప్పలేదు. జీసస్ పశువుల పాకలోనే పుట్టాడు కాబట్టి క్రైస్తవులు గోవును పవిత్రంగా చూస్తారని చెప్పిన ఇంద్రేశ్.. ఇస్లాం దేశాలైన మక్కా మదీనాలలో కూడా గోవధను నిషేధించారని గుర్తుచేశారు.
రాజస్థాన్ లోని అల్వార్లో గోవులను స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిని అక్కడి స్థానికులు పట్టుకుని చితకబాదటంతో ఆ వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో ఇంద్రేశ్ వ్యాఖ్యలు పెనుదుమారమే రేపుతున్నాయి. సోషల్ మీడియాలో ఇంద్రేశ్ వ్యాఖ్యలపై నెటిజెన్లు మండిపడుతున్నారు. గోవా, ఈశాన్య భారతంలోనే ఎక్కువగా బీఫ్ తింటారని మరి అక్కడ ఎందుకు సామూహిక దాడులు జరగడం లేదని ఇంద్రేశ్ను ప్రశ్నించారు కొందరు నెటిజెన్లు.
ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఇంద్రేశ్ను వెంటనే అరెస్టు చేయాలని లేదంటే మతఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందని మరికొందరు ట్వీట్ చేశారు. ఇంకొందరు ఇంద్రేశ్ పాలు తాగడం మానేస్తే అన్ని సమస్యలు సమిసిపోతాయంటూ ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉంటే సామూహిక దాడులపై మంగళవారం లోక్సభ దద్దరిల్లింది. ఈ దాడులను ఆపడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ధ్వజమెత్తాయి. విపక్ష పార్టీలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు. సామూహిక దాడులను అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకొస్తామని సభకు వెల్లడించారు.