జాట్ల ‘హస్తిన’ బాట: ముప్పేట అణచివేత వ్యూహం.. రేపు ‘పార్లమెంట్ ఘెరావ్’
విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ జాట్లు మరోసారి ఆందోళనకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమూ అప్రమత్తమయ్యాయి.
న్యూఢిల్లీ/ చండీగఢ్: విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ జాట్లు మరోసారి ఆందోళనకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమూ అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ, ఇరుగు పొరుగు రాష్ట్రాల పరిధిలో భారీగా పోలీసు బలగాలను నియుక్తులను చేశాయి. ఆందోళనకారులను ముందుకు వెళ్లకుండా నిలువరించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది.
ప్రత్యేకించి హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలని సూచించింది. ఆందోళనకారులను అనుమతించవద్దని కూడా ఆయా ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇక ఆందోళనకు కేంద్ర బిందువైన హర్యానా రాష్ట్రంలోని సున్నితమైన జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను సస్పెండ్ చేసింది.
ట్రాలీలు, ట్రాక్టర్ల రవాణాపైనా నిషేధం
జాట్ ఆందోళన కారులతో ట్రాక్టర్లు, ట్రాలీలను అనుమతించవద్దని కూడా కేంద్ర ప్రభుత్వం స్ఫష్టం చేసింది. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం అఖిల భారతీయ జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో సోమవారం ‘పార్లమెంట్ ఘెరావ్' ఆందోళన చేపట్టేందుకు హర్యానా నుంచి జాట్లు బయలుదేరారు. ఈ పరిస్థితుల్లో దేశ రాజధాని ‘న్యూఢిల్లీ' నగర పరిధిలోనూ, ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ భద్రతపై కేంద్ర హోంశాఖ సమీక్షించింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అధికారులతో హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సమీక్షించారు. ఆందోళన సందర్భంగా ప్రశాంత జన జీవనానికి ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.
నిత్యావసరాలతో ఢిల్లీకి జాట్ల ప్రయాణం
జాట్లు తమ డిమాండ్లు సాధించుకొనేందుకు ట్రాక్టర్లు, వాహనాలపై పది రోజుల భోజనానికి సరిపడా సరుకులతో దేశ రాజధాని ‘హస్తిన'కు ప్రదర్శనగా బయలు దేరారని అఖిల భారతీయ జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు యశ్పాల్ మాలిక్ తెలిపారు. తమకు విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తోపాటు గత ఆందోళన సమయంలో పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, జైళ్లలో మగ్గుతున్న యువకులను విడిచిపెట్టాలని, గత ఏడాది ఆందోళన సమయంలో చనిపోయిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని జాట్లు డిమాండ్ చేస్తున్నారు.
సున్నితమైన జిల్లాల్లో ‘ఇంటర్నెట్’పై ఆంక్షలు
ఇక జాట్ల ఆందోళనకు మూలమైన హర్యానాలోని రోహతక్, ఝాజ్జర్, భీవానీ, ఛార్ఖీ దాద్రి, హిస్సార్ వంటి అత్యంత సున్నితమైన జిల్లాల పరిదిలో నిరవధికంగా నిషేధాజ్నలు ప్రకటించారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లా మధ్య ట్రాక్టర్లు, ట్రాలీల రాకపోకలను అనుమతించొద్దని కోరారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు చేయూతనివ్వాలని కోరుతూ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది.
కేంద్రం జోక్యం చేసుకోవాలన్న జాట్ల ఆరక్షణ సంఘర్ష్ సమితి
ఈ సమస్య పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అఖిల భారతీయ జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు యశ్పాల్ మాలిక్ డిమాండ్ చేశారు. 2016 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు హర్యానా ప్రభుత్వంతో ఆరుసార్లు చర్చలు జరిపినా తమ డిమాండ్లు పరిష్కారం కాలేదని చెప్పారు. మనోహర్ లాల్ ఖట్టర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సమస్య పరిష్కారం పట్ల గందరగోళంలో చిక్కుకున్నదని యశ్పాల్ మాలిక్ ఆరోపించారు. నిజాయితీగా సమస్య పరిష్కారానికి పూనుకోలేదని తెలిపారు.
ఆందోళన బలహీన పరిచేందుకు ఖట్టర్ సర్కార్ యత్నం
తమ ఆందోళనను బలహీన పరిచేందుకు మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అఖిల భారత జాట్ల అరక్షణ్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు యశ్ పాల్ మాలిక్ ఆరోపించారు. తమ సమస్యలు, డిమాండ్లను పరిష్కరించేందుకు మనోహర్ లాల్ ఖట్టర్ తుది నిర్ణయం తీసుకోవాలని తాము కోరుతున్నామని తెలిపారు. కానీ తమ డిమాండ్లను ప్రభుత్వం సంక్లిష్టం చేయడంతో కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తేనే సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుందని నిర్ణయానికి వచ్చామని యశ్పాల్ మాలిక్ పేర్కొన్నారు. తమ డిమాండ్లను ప్రజాతంత్రయుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతం అని తెలిపారు. అందులో భాగంగానే గత జనవరి 29వ తేదీ నుంచి అఖిల భారతీయ జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నది.