జాన్సన్స్ షాంపూ అమ్మకాలపై నిషేధం..! ఎందుకంటే?
ఢిల్లీ : బేబీ కేర్ ప్రొడక్ట్స్లో పేరుపొందిన జాన్సన్ అండ్ జాన్సన్కు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ షాక్ ఇచ్చింది. ఆ కంపెనీ తయారు చేసే బేబీ షాంపూ అమ్మకాలను ఐదు రాష్ట్రాల్లో నిషేధించింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, అసోం, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో షాంపూ విక్రయాలను నిలిపివేయాలంటూ ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసింది.
జాన్సన్స్ షాంపూలో పిల్లలకు హాని చేసే ఫార్మల్ డీహైడ్ ఉన్నట్లు టెస్టుల్లో తేలినందున అమ్మకాలను నిలిపివేయించినట్లు ఎన్సీపీసీఆర్ స్పష్టం చేసింది. రాజస్థాన్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ నిర్వహించిన పరీక్షల్లో విషయం తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జాన్సన్స్ షాంపూపై 2016 నుంచి కంప్లైంట్స్ అందుతుండటంతో ఐదు రాష్ట్రాల్లో శాంపిల్స్ సేకరించి ప్రభుత్వ ల్యాబ్లలో పరీక్షించాలని చెప్పినట్లు ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో చెప్పారు.
జాన్సన్స్ బేబీ టాల్కం పౌడర్పైన ఫిర్యాదులు అందినందున వాటి శాంపిల్స్ కూడా లేబరేటరీల్లో పరీక్షల కోసం పంపినట్లు కనూంగో చెప్పారు. అయితే వాటి రిపోర్టులు ఇంకా రాలేదని, ఒకవేళ నాణ్యతా ప్రమాణాలు లేవని తేలితే వాటి విక్రయాలపై నిషేధం విధిస్తామని చెప్పారు.