నియంత్రణ రేఖ వద్ద వేడికోలు: "కాల్పులు ఆపండి.. మేం అంత్యక్రియలు నిర్వహించుకోవాలి"
నియంత్రణ రేఖ ( ఎల్ఓసీ) వెంబడి ఉన్న గ్రామాల్లో కశ్మీరీలు ఎలాంటి భయానక పరిస్థితుల్లో జీవిస్తున్నారన్న దానికి ఈ కథమే సజీవ సాక్ష్యం.
శ్రీనగర్: శత్రువుని వేడుకునే సందర్భం యుద్ధంలోనే ఎదురవుతుందని అనుకుంటే.. ఇండియా , పాకిస్తాన్ ఇప్పటికే యుద్ధం చేస్తున్నట్లు లెక్క. నియంత్రణ రేఖ ( ఎల్ఓసీ)ని ఆనుకుని ఉన్న నూర్ కోటే గ్రామంలో కనిపించిన ఒక భీకర సన్నివేశం కశ్మీరీలు ఎలాంటి భయానక పరిస్థితుల్లో జీవిస్తున్నారన్న దానికి ఈ కథమే సజీవ సాక్ష్యం.
గడిచిన కొద్ది నెలలుగా సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా పాకిస్తాన్ రెంజర్లు విచ్చలవిడి కాల్పులకు తెగబడుతున్నారు. గురువారం నాడు పాక్ జరిపిన కాల్పుల్లో కూడా నూర్ కోటే గ్రామానికి చెందిన తన్వీర్ అనే 16 ఏళ్ల బాలుడు చనిపోయాడు.
పూంచ్ జిల్లా హవేలీ తాలూకాలో ఉన్న నూర్ కోటే గ్రామంలో.. సరిగ్గా కంచె వెంబడే యా బాలుడి కుటుంబానికి చెందిన పొలం ఉంది. పాక్ సైనికుల కాల్పుల్లో మరణించిన ఆ బాలుడ్ని అదే పొలంలో సమాధి చేయాలని కుటుంబ సభ్యులు భావించారు.
మర్నాడు అంటే శుక్రవారం జనాజా ప్రార్థన ముగిసిన తర్వాత శవయాత్ర బయలుదేరింది. అంతలోనే పాక్ వైపు నుంచి మళ్ళీ కాల్పుల మోత! బాలుడి అంత్యక్రియలు కూడా నిర్వహించలేని పరిస్థితిలో... మత పెద్దలు మసీదులోని మైక్ నుంచి బిగ్గరగా అరిచారు.
" మీరు మా వాడిని కాల్చి చంపారు. అతడికి అంత్యక్రియలు నిర్వహించాలి. కాల్పులు ఆపండి.. " అంటూ మతపెద్దలు మైక్ లో చెప్పడంతో కొద్దిసేపటికి పాక్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి.
వెనువెంటనే అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్తులు విషాద హృదయాలతో వెనుదిరిగారు. భారత పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల ప్రజలు నిత్యం ఇలాంటి సంకట పరిస్థితులే ఎదుర్కొంటున్నట్లు స్థానిక ఎమ్మెల్సీ జహంగీర్ మీర్ మీడియాకు చెప్పారు.
సెప్టెంబర్ చివరలో భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లపై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన తర్వాత పాక్ దాదాపు 300 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 27 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోగా వారిలో 14 మంది భద్రతా సిబ్బంది కావడం గమనార్హం. ఆదివారం ఉదయం కూడా పూంచ్ సెక్టార్ పైకి పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు.