కదిలించే కశ్మీరీల వ్యథ: అంత్యక్రియలకూ 'కాల్పుల' ఆటంకాలే..
కాల్పుల్లో మరణించిన తమవారికి కనీస అంత్యక్రియలు కూడా నిర్వహించుకోలేని స్థితిలో కశ్మీర్ ప్రజలు ఉన్నారు.
శ్రీనగర్: పాక్ కాల్పుల ఉల్లంఘనతో క్షణం క్షణం భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్న కశ్మీర్ ప్రజలు.. కాల్పుల్లో మరణించిన తమవారికి కనీస అంత్యక్రియలు కూడా నిర్వహించుకోలేని స్థితిలో ఉన్నారు. నియంత్రణ రేఖ(ఎల్.వో.సి)ని ఆనుకుని ఉన్న నూర్ కోటే గ్రామంలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
పాక్ పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఆ దేశం ఇప్పటిదాకా 300సార్లు కాల్పుల ఉల్లంఘన చట్టాన్ని విరమించింది. ఇందులో బలైపోతున్నది సరిహద్దు వెంబడి ఉన్న భారత గ్రామ ప్రజలే. ఇదే క్రమంలో పూంచ్ సెక్టార్ లో ఉన్న నూర్ కోటే గ్రామంపై పాక్ కాల్పులకు తెగబడడంతో.. తన్వీర్(16) అనే బాలుడు చనిపోయాడు.
కాగా, తన్వీర్ మృతదేహానికి తమ పొలంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఆ పొలం సరిగ్గా ఎల్.వో.సి కంచె వెంబడి ఉండటంతో పాక్ నుంచి మరోసారి కాల్పుల పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
భయం, భయంగానే మృతదేహాంతో పొలం వద్దకు వెళ్లారు. ఇంతలోనే పాక్ నుంచి మళ్లీ కాల్పులు మొదలవడంతో.. ఇళ్లవైపు పరుగు తీయాల్సి వచ్చింది. అనంతరం స్థానిక మసీదు నుంచి అక్కడి మతపెద్దలు పాక్ కు విజ్ఞప్తి చేశారు. 'మీరు మా వ్యక్తిని కాల్చి చంపారు. అతని అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. కాల్పులు విరమించండి' అంటూ ప్రకటన చేశారు.
దీంతో కొద్దిసేపు కాల్పులు నిలిచిపోవడంతో తన్వీర్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. తన్వీర్ బాధతో దు:ఖ సంద్రంలో ఉన్న ఆ కుటుంబం.. కొడుకుకు అంత్యక్రియలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితుల్లో విషన్న వదనాలతో కనిపించారు. బరువెక్కిన హృదయాలతో అంత్యక్రియలు నిర్వహించిన పొలం నుంచి వెనుదిరిగారు.
సరిహద్దు గ్రామాల ప్రజలు ఇలాంటి ధీనస్థితులను అనేకం ఎదుర్కొంటున్నారని స్థానిక ఎమ్మెల్సీ జహంగీర్ అన్నారు. కాగా, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్ చేసిన కాల్పుల దాటికి ఇప్పటిదాకా 27మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14మంది భద్రతా సిబ్బంది ఉండటం గమనార్హం.