భారీ వర్షాలు: యూపీ, రాజస్థాన్లో 30 మంది మృతి, కూలిన తాజ్ పిల్లర్
ఆగ్రా: ఉత్తరభారతంలో వర్షాలు భీభత్సం సృష్టించాయి.అకాల వర్షాలతో ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో 15 మంది చనిపోయారు. రాజస్థాన్లో 16 మంది చనిపోయారు. గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తీవ్రంగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ రెండు రాష్ట్రాల్లో సుమారు 31 మంది చనిపోయారు.పలువురు గాయపడ్డారు.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని బ్రజ్ ప్రాంతంలో 15 మంది మృత్యువాత పడ్డారు.తాజ్మహల్ ప్రవేశ ద్వారం వద్ద ఓ పిల్లర్ కుప్పకూలిపోయింది. 'దర్వాజా-ఈ-రౌజా'గా పిలిచే దక్షిణం వైపుకు గేటుకు సంబంధించిన 12 అడుగుల మెటల్ పిల్లర్ పడిపోయింది 40 నిమిషాల భారీ వర్షం కురిసింది. ఈ ప్రభావంతో ఫిల్లర్ పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. తాజ్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. యూపీ రాష్ట్రంలోని బ్రజ్ ప్రాంతంలో వర్షం కారణంగా 15 మంది మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. జౌన్పూర్ షాగంజ్లోని మసీదు పిల్లరు కూడ కూలిపోయింది.
సుమారు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు రాజస్థాన్ రాష్ట్రంలో కూడ ఇదే తరహలో వర్షంతో తీవ్రంగా నష్టపోయింది.రాజస్థాన్లో సుమారు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. భరత్పూర్ ప్రాంతంలో అయిదుగురు చనిపోయారు. ధోల్పూర్ జిల్లాలో 11 మంది చనిపోయారు. ఇందులో అయిదుగురు చిన్నారులున్నారు. సుమారు వంద మందికి పైగా గాయపడ్డారు.
విద్యుత్, కమ్యూనికేషన్ల వ్యవస్థ పాడైందని అధికారులు ప్రకటించారు. ఈదురుగాలుల కారణంగా నష్ట తీవ్రత పెరిగిందని అధికారులు అభిప్రాయపడ్డారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని అధికారులు అనుమానిస్తున్నారు.