విదేశాల్లో చిక్కుకుని భారత్కు రావాలనుకుంటున్నవారు ఈ ఫారంను పూర్తి చేయాల్సి ఉంటుంది
న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న వారిని భారత్కు రప్పించే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. 13దేశాల్లో చిక్కుకుపోయిన 14వేల మంది భారతీయులను 64 విమానాలు, 3 నేవీ యుద్ధ విమానాల్లో భారత్కు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ప్రక్రియను మే 7 నుంచి ప్రారంభించనుంది. మార్చిలోనే ఇతర దేశాల నుంచి వచ్చే విమానాలతో పాటు దేశీయ విమాన సర్వీసులను కూడా నిషేధించి కఠిన చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో విద్యార్థులు, ఉద్యోగస్తులు విదేశాల్లోనే చిక్కుకుపోయారు. ఇదిలా ఉంటే భారత్కు రావాలనుకుంటున్న వారి జాబితాను యూఏఈ, యూకే, అమెరికాలోని భారత కాన్సులేట్లు తయారు చేస్తున్నాయి.'
అబుదాబిలో చిక్కుకుపోయిన భారతీయుల కోసం
ఇక గల్ఫ్ దేశాల్లో 10 మిలియన్ మంది భారతీయులు ఉండగా ఒక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారత్కు వచ్చేందుకు 1,50,000 మంది భారత కాన్సులేట్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో నాలుగోవంతు మంది లాక్డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. ఇక ఎవరెవరైతే భారత్కు వెళ్లాలనుకుంటున్నారో వారు ఒక దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుందని అబుదాబి లోని ఎంబసీ ఆఫ్ ఇండియా మరియు దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలు కోరాయి. ఒక వ్యక్తి ఒకేసారి పూర్తి చేయాలని చెప్పగా... కుటుంబాలు అయితే ప్రతి వ్యక్తి ఒక దరఖాస్తు పూర్తి చేయాలని కోరింది. ఇక కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా సెపరేట్ ఫారంను పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇక దరఖాస్తులు రాగానే వీటిపై ఒక నిర్ణయం తీసుకుని ప్రయాణికులను భారత్కు చేరవేస్తామని పేర్కొంది. ఇక ప్రయాణంకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని వెబ్సైట్లో పొందుపర్చింది. ఇక విమానం ఎక్కేముందు యూఏఈ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను, భారత్లో దిగిన తర్వాత భారతప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఫాలో అవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.ఇక మొత్త ప్రక్రియ కోసం ఒక రిజిస్ట్రేషన్ ఫారం వెబ్సైట్లో పొందుపర్చింది. ఈ ఫారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://www.cgidubai.gov.in/covid_register/
రియాద్లో...
ఇక రియాద్లోని ఎంబసీ ఆఫ్ ఇండియా కూడా ఇలాంటి ఫారమే ఒకటి తన వెబ్సైట్లో పొందుపర్చింది. ఇప్పటికైతే భారతీయులను ఎలా ఎప్పుడు పంపాలన్నదానిపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని ఒక్కసారి తేదీ నిర్ణయించగానే తరలింపు ప్రక్రియను వేగవంతం చేస్తామని రియాద్లోని ఎంబసీ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇందుకోసం ప్రయాణికుల సమాచారంను ముందుగానే సేకరిస్తున్నామని చెప్పిన ఎంబసీ... ప్రయాణికులు పూర్తి వివరాలు ఈ కింది లింక్పై క్లిక్ చేసి పూర్తి వివరాలు పొందుపర్చాలని పేర్కొంది. ఫారం పూర్తి చేస్తే సరిపోతుందని ప్రత్యేకించి ఎలాంటి ఈ-మెయిల్స్ చేయక్కర్లేదని స్పష్టం చేసింది.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSc_yyVAYPD-VYH98RNOWZkDkGKVsf34qnu0oGoLdtts3RG7_Q/viewform
మాల్దీవుల్లో చిక్కుకుపోయిన వారికోసం...
ఇక మాల్దీవులో చిక్కుకుపోయిన భారతీయులు తిరిగి సొంత దేశానికి వెళ్లేందుకు మాల్దీవుల రాజధాని మాలెలోని భారత హైకమిషన్ తన వెబ్సైట్లో వివరాలను పొందుపర్చింది. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును నింపాలని సూచించింది. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును attcons.malemea.gov.in. అనే ఈ-మెయిల్కు పంపాల్సి ఉంటుందని కోరింది. మరిన్ని వివరాల కోసం లేదా పూర్తి సమాచారం కోసం ఈ మొబైల్ నెంబర్కు ఫోన్ చేయాల్సిందిగా పేర్కొంది. +960-7725751 (విక్రమ్ రావల్, వెల్ఫేర్ ఆఫీసర్). ఇక ప్రస్తుతం భారత్లో లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో అక్కడి విమాన సర్వీసులు రద్దయ్యాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని భారత హైకమిషన్ స్పష్టం చేసింది. అంతేకాదు పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుపుతామని భారత హైకమిషన్ పేర్కొంది. ఇందుకోసం ఫేస్బుక్ ట్విటర్లను ఫాలో కావాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://hci.gov.in/male/?10196?000
అమెరికాలో చిక్కుకుపోయిన వారి కోసం
అమెరికాలో ఉన్న భారతీయులు ఎవరైతే సొంత దేశాలకు వెళ్లాలనుకుంటున్నారో ఒక అప్లికేషన్ ఫారంను పూర్తి చేయాల్సి ఉంటుందని అమెరికాలోని ఎంబసీ ఆఫ్ ఇండియా కోరింది. భారత్కు తిరిగి వెళ్లాలనుకునే భారతీయులు తమ సమచారం పూర్తి చేస్తే వారికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తామని భారత ఎంబసీ ప్రకటించింది. అంతేకాదు అమెరికా నుంచి భారత్కు విమానాలు ఎప్పుడు వెళతాయో అనే విషయాన్ని కూడా ప్రయాణికులకు తెలుపుతామని పేర్కొంది. ఫారం పూర్తి చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
https://indianembassyusa.gov.in/reg_indian_nationals
యూకేలో వారికోసం
ఇక యూకేలో చిక్కుకుని భారత్కు రావాలనుకుంటున్న భారతీయులకు లండన్లోని హైకమిషన్ తన వెబ్సైట్లో పూర్తి వివరాలను పొందుపర్చింది. ఎయిర్ ఇండియా విమానాలు దశలవారీగా ప్రయాణికులను భారత్కు తీసుకెళుతాయని పేర్కొంది. ఇందుకోసం భారత్ వెళ్లాలనుకుంటున్నావారంతా తమ సమాచారంను పొందుపర్చాల్సి ఉంటుందని వెల్లడించింది. మే 7నుంచి విమానాలు బయలుదేరుతాయని ప్రకటించింది. లండన్లోన హీత్రూ విమానాశ్రయం నుంచి ఈ విమానాలు టేకాఫ్ తీసుకుంటాయని స్పష్టం చేసింది. ముందుగా గర్భిణీలకు , వృద్ధులకు, మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నవారి తరలింపుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు భారత హైకమిషన్ పేర్కొంది. ఇక దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈమెయిల్ ద్వారా సమాచారం చేరవేస్తామని వెల్లడించింది. ఇక ఇదంతా ప్రయాణికులు సొంత డబ్బులతోనే జరుగుతుందని స్పష్టం చేసిన భారత హైకమిషన్.. ఎయిరిండియా డైరెక్ట్గా ప్రయాణికులతో టచ్లోకి వస్తుందని వెల్లడించింది. ఇక భారత్కు చేరుకోగానే ఆరోగ్యసేతు యాప్ తప్పక డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని ఆ తర్వాత 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి.