యూపీలో దారుణం: ఎనిమిదేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి..మృతి చెందిన బాలిక
సహారన్పూర్: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. సహారన్పూర్లో ఎనిమిదేళ్ల చిన్నారిపై వీధికుక్కలు దాడి చేసి చంపేశాయి. కట్టెలు తెచ్చేందుకు దగ్గరలోని అడవుల్లోకి బాలికి వెళ్లిన సమయంలో కుక్కలు చిన్నారిపై అటాక్ చేశాయి. ఈ ఘటన మీర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలికను మిస్భాగా గుర్తించారు పోలీసులు.
ఆదివారం రోజున మధ్యాహ్నం 1:30 గంటలకు ఎనిమిదేళ్ల మిస్భా తన మిత్రులతో కలిసి దగ్గరలోని అడవికి కట్టెలు తీసుకొచ్చుకునేందుకు వెళ్లింది. వీధికుక్కలు దాడి చేసిన సమయంలో వీరంతా అడవిలోనే ఉన్నారు. ముందుగా కుక్కలు వీరిని తరమడం ప్రారంభించాయి. అయితే మిగతా పిల్లలు పరుగులు తీసి తప్పించుకోగా మిస్భా మాత్రం కుక్కలకు దొరికింది. తప్పించుకుని పరుగులు తీసిన మిస్భా మిత్రులు గ్రామస్తులకు ఘటన గురించి తెలిపారు. వెంటనే గ్రామస్తులు ఘటనా స్థలానికి పరుగులు తీశారు. అప్పటికే కుక్కలు మిస్భాపై దాడి చేశాయి. ఘటనా స్థలంలో మిస్భా రక్తపు మడుగులో పడిఉంది.
గ్రామస్తుల చేతిలో కర్రలను చూసిన కుక్కలు మిస్భాను వదిలి పరుగులు తీశాయి. హాస్పిటల్కు తరలించకముందే తీవ్రగాయాలపాలైన మిస్భా కన్నుమూసింది. ఇక జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు గ్రామస్తులు. తమ పిల్లలను అడవుల్లోకి పంపరాదని గ్రామస్తులకు సూచించారు పోలీసులు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాధికారి జరిగిన ఘటనపై తెలుసుకునేందుకు గ్రామానికి రాకపోవడం విశేషం.
ఇదిలా ఉంటే ఈ ఏడాది అక్టోబర్ నెలలో కూడా తమిళనాడులోని తిరునేల్వేలి ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలుడిని వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. సంతోష్ అనే బాలుడిపై కుక్కలు దాడిచేసి చంపేశాయి. సంతోష్ ప్రతిరోజు స్కూలుకు వెళ్లేవాడు. అయితే మృతి చెందిన రోజున కూడా స్కూలుకు వెళ్లేవాడు. అయితే ఆ రోజు రోడ్డుపై నుంచి కాకుండా తొందరగా వెళ్లాలన్న ఉద్దేశంతో పొలాల్లో పరుగులు తీశాడు. ఇక సాయంత్రం 6 గంటలు కావొస్తున్నప్పటికీ తమ కొడుకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సంతోష్ కోసం వెతికారు. పొలాల్లో వెతకగా అక్కడే కుక్కలు మృతి చెందిన సంతోష్ శరీరంను పీక్కు తింటుండటం గమనించారు. స్థానికులు కుక్కలను తరిమి హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే సంతోష్ మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటన మరువక ముందే మరో చిన్నారిని ఉత్తర్ ప్రదేశ్లో వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన వెలుగు చూసింది.