ఉత్తరాదిని వణికించిన భూకంపం, నేపాల్లో మళ్లీ: గుంటూరు సహా ఏపీలోను ప్రకంపనలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: భూకంపం మరోసారి వణికించింది. ఉత్తర భారతం కంపించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్లలో మంగళవారం మధ్యాహ్నం భూమి కంపించింది. దీంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఇళ్లనుంచి పరుగులు తీశారు.
కార్యాలయాలలో పని చేస్తున్న ఉద్యోగులు కూడా భయకంపితులై బయటకు పరుగులు తీశారు. అఫ్ఘనిస్తాన్ కేంద్రంగా మంగళవారం ఈ భూప్రకంపనం చోటు చేసుకుందని తెలుస్తోంది. భూమి ఉపరితలం నుంచి 19 కిలో మీటర్ల లోతులో భూమి కంపించినట్టు భూప్రకంపన అధ్యయన కేంద్ర నిపుణులు చెబుతున్నారు.
కొన్నిచోట్ల భూమి 7.2 గా, మరికొన్నిచోట్ల 6.9 గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. నేపాల్లో భూకంపం సంభవించిన కొద్ది రోజులకే మళ్లీ ఈ సంఘటన జరగడం గమనార్హం. నేటి భూప్రకంపనం దాదాపు ఒక నిమిషం పాటు ఉందని చెబుతున్నారు.
ఆప్ఘనిస్తాన్, నేపాల్, ఇండోనేషియాల్లో మధ్యాహ్నం భూకంపం వచ్చింది. ఆప్ఘనిస్తాన్లో పదకొండు నలభై అయిదు నిమిషాలకు, ఇండోనేషియాలో పన్నెండు గంటలకు, నేపాల్లో పన్నెండున్నర గంటలకు భూకంపం వచ్చింది. వీటి ధాటికి భారత్లో ప్రకంపనలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు
ఆప్ఘన్లో భూకంపం ధాటికి ఏపీలోను పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, కృష్ణా జిల్లాలోని భవానీపురం, గొల్లపూడి తదితర చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఆప్ఘనిస్తాన్లోని భూకంపం ధాటికి 7.4 తీవ్రతతో భూకంపం రావడంతో వాటి ప్రభావం భారత్ పైన పడింది. అయితే, స్వల్పస్థాయిలో ప్రకంపనలు వచ్చాయి.
కృష్ణా, గుంటూరు, విశాఖ, రాజమండ్రి, శ్రీకాకుళం జల్లాల్లో ప్రకంపనలు సంభవించాయి. పలుచోట్ల ఇంట్లో వస్తువు ఊగినట్లు కనిపించింది. దీంతో జనాలు రోడ్ల పైకి వచ్చారు. ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. విజయవాడ, కృష్ణా జల్లాల్లో పలు ప్రాంతాల్లో పది సెకన్ల పాటు స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి.