అసెంబ్లీలో బ్యాక్ బెంచ్కు సచిన్ పైలట్... మొదటిరోజే బీజేపీకి అదిరిపోయే కౌంటర్...
మాజీ డిప్యూటీ సీఎం,కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ రాజీతో రాజస్తాన్ రాజకీయ సంక్షోభం సమసిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు సాగిన సంక్షోభం చివరకు సుఖాంతమై నేడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే సచిన్ పైలట్ను బీజేపీ టార్గెట్ చేసింది. సభలో ఆయన కూర్చొనే స్థానం మారడంపై విమర్శలు గుప్పించింది. సచిన్ పైలట్ కూడా బీజేపీ విమర్శలకు ధీటైన బదులిచ్చారు.
బ్యాక్ బెంచ్కు సచిన్ పైలట్...
అశోక్ గెహ్లాట్ సర్కార్పై తిరుగుబాటు బావుటా ఎగరేయడంతో సచిన్ పైలట్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో శాసనసభలో ట్రెజరీ బెంచీల్లో కూర్చొనే అవకాశం లేకుండా పోయింది. సభలో వెనుక వరుసలో ఆయనకు సీటును కేటాయించారు. దీంతో సచిన్ పైలట్ సభలోకి రాగానే బీజేపీ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టింది. ఆ విమర్శలకు సచిన్ పైలట్ గట్టిగానే స్పందించారు.
వారియర్సే వెనకాల కాపలాగా ఉంటారని...
వెనుక వరుసలో ప్రతిపక్ష బెంచీలకు దగ్గరగా తన స్థానాన్ని మార్చడానికి కారణం.... బోర్డర్కు కాపలాగా ఒక ధీటైన వారియర్ ఉండాలని తమ ప్రభుత్వం కోరుకోవడమేనన్నారు.' ఈ ఉదయం 10.45గంటలకు నేను అసెంబ్లీలోకి వచ్చినప్పుడు... నా సీటు మారడంపై రెండు నిమిషాలు ఆశ్చర్యపోయాను. నేను ముందు వరుసలో కూర్చున్నప్పుడు సేఫ్గా ఉన్నాను. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాను. ఇప్పుడు వెనుక వరుసకు మార్చారు. ఇక్కడ ఎప్పుడూ శక్తివంతమైన వారియర్సే కాపలాగా ఉంటారు.' అని సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు.
పార్టీ ప్రయోజనాలను పరిరక్షించేందుకు...
'కాలక్రమేణా ప్రతీది తెలుస్తుంది. నా గురించైనా లేదా నా కొలిగ్స్ గురించి చెప్పేదైనా చర్చకు వస్తుంది. మేము ఎవరి వద్దకు వెళ్లాలో వారి వద్దకే వెళ్లాం. అయితే ఇప్పుడవన్నీ అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించాలి.'అని సచిన్ పైలట్ పేర్కొన్నారు. 'ఇప్పుడు మేమంతా కలిసి ఉన్నాం. సరిహద్దు వద్ద ఏ ఫిరంగి కాల్పులు జరిపినా... నేను లేదా మనందరం కాపలాగా నిలబడి పార్టీ ప్రయోజనాలను పరిరక్షిస్తాం.' అని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి పేర్కొన్నారు.
Recommended Video
బీజేపీ విమర్శలు....
మరోవైపు బీజేపీ నేతలు సతీష్ పూనియా సహా పలువురు నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఓవైపు కరోనా వైరస్,వరదలు,మిడతల దండుతో రాష్ట్రం సతమతమవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అంతర్గత లుకలుకలతో పోరాడుతూ వచ్చిందన్నారు. ఆ కారణంగా పాలనపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. రాజస్తాన్ బీజేపీ డిప్యూటీ చీఫ్ రాజేంద్ర రాథోర్ మాట్లాడుతూ... ప్రజలు కాంగ్రెస్ డ్రామాను గమనిస్తున్నారన్నారు. హీరోలు,విలన్లు,నటులు అంతా ఒక్క పార్టీలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు.