వారి వల్లే: ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ దుమ్ముదులిపిన సుష్మాస్వరాజ్
న్యూయార్క్: ఐక్య రాజ్య సమితి వేదికగా భారత్.. పాకిస్తాన్ తీరును ఎండగట్టింది. చర్చల అంశంపై పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. ఆమె హిందీలో ప్రసంగించారు. ఉగ్రవాదులు కాశ్మీర్లో ముగ్గురు పోలీసులను అపహరించి హత్య చేశారన్నారు. న్యూయార్క్లో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు భేటీ కావాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాశారని, దానికి అంగీకరించామని, కానీ అలా రాసిన గంటల్లోనే ముగ్గురు పోలీసులను అపహరించి హత్య చేశారన్నారు.
జవాను కిరాతర హత్యకు పాక్పై ప్రతీకారం, స్థావరాలను నుగ్గు చేసి, శతఘ్నులతో భారీ దాడి
ఇలాంటి సమయంలో చర్చలు ఎలా ముందుకు సాగుతాయన్నారు. 2016లో డిసెంబర్ 9న తామే ఇస్లామాబాద్ వెళ్లి ద్వైపాక్షిక చర్చలకు శ్రీకారం చుట్టామని, ఆ తర్వాత మూడు నెలలకే పఠాన్కోట్ దాడి జరిగిందని, ఈ పరిస్థితుల్లో చర్చలు ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నించారు. ఉగ్రవాదానికి ఊతమివ్వడాన్ని ప్రభుత్వ విధానంగా తీసుకున్న పాకిస్థాన్, ఆ విషయంలో లేశమాత్రంగానైనా మారలేదని సుష్మా స్వరాజ్ దుయ్యబట్టారు. ముష్కరులకు ఊతమిచ్చే దేశంతో, ముంబై దాడుల ప్రధాన కుట్రదారుడిని ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరగనిస్తున్న దేశంతో. భారత్ చర్చలెలా జరుపుతుందన్నారు.
పాక్తో చర్చలు జరపాలని భారత్ అనేక ప్రయత్నాలు చేసిందని, కానీ వాటిని రద్దు చేసుకోవడానికి ఏకైక కారణం ఆ దేశం ప్రవర్తనే అన్న్నారు. చర్చల ప్రక్రియకు భంగం కలిగించామని తిరిగి తమపై నిందలు వేస్తుంటారని, ఇది పచ్చి అబద్దమన్నారు. అత్యంత సంక్లిష్ట వివాదాలకు సహేతుక పరిష్కారాలు చర్చల్లోనే లభిస్తాయని తమ నమ్మకం అన్నారు. పాక్తో చర్చలు చాలాసార్లు మొదలయ్యాయని, అవి ఆగిపోయాయంటే దానికి కారణం పాకిస్తానే అన్నారు. రక్త తర్పణం మధ్య చర్చలెలా సాగుతాయో చెప్పాలన్నారు.
తీవ్రతలో తేడా ఉన్నా ప్రపంచానికంతటికీ ఉగ్రవాద ముప్పు ఉందని, తమ విషయంలో ఉగ్రవాదం మరెక్కడో దూరంగా కాకుండా సరిహద్దు అవతలి నుంచే పురుడు పోసుకొంటోందని, పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతమివ్వడమే కాకుండా మాటలతోనూ విషం చిమ్ముతోందని, అమెరికాపై దాడులకు దిగినవారిని ఆ దేశం మట్టుబెట్టినా ముంబై దాడుల కుట్రదారులు పాక్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, బిన్ లాడెన్ను అమెరికా ప్రత్యేక బలగాలు పాక్లో మట్టుబెట్టిన తర్వాత కూడా అసలుఏమీ జరగనట్లు పాక్ నటించిందని, అయితే పాక్ను విశ్వసించడానికి ప్రపంచం ఇక ఎంతమాత్రం సిద్ధంగా లేకపోవడం మాత్రం హర్షణీయమన్నారు.
భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని పాకిస్తాన్ పదేపదే నిందలు వేయడాన్ని సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారు. అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకునే ఉగ్రవాది కంటే మానవ హక్కుల్ని ఉల్లంఘించే ఘనులు ఇంకెవరు ఉంటారన్నారు. స్వీయ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్పై మోసపూరితంగా, వంచనతో దుమ్మెత్తిపోయడం పాకిస్తాన్కు అలవాటు అన్నారు. గత ఏడాది ఐరాస సమావేశాల్లో పాకిస్తాన్ ప్రతినిధి- భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పేరిట తప్పుడు ఛాయాచిత్రాలు చూపించి బురిడీ కొట్టించాలని ప్రయత్నించారన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు పాకిస్తాన్కు మామూలే అన్నారు.