ఐస్క్రీములో మత్తు, యువతికి తినిపించిన టీటీఈ, పాంట్రీ స్టాఫ్.. ఆపై...
న్యూఢిల్లీ : రైళ్లలో ప్రయాణం సురక్షితం, సుఖవంతం అనుకొంటున్నారా ? అవును హ్యాపీగా జర్నీ చేయొచ్చు. కానీ సేఫ్టీపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సాధారణంగా రైళ్లలో చోరీల బెడద ఉంటుంది. కానీ ఇప్పుడు దొంగల బాధతోపాటు శీలానికి రక్షణ లేకుండాపోతోంది. అయితే ప్రయాణికులపై కొందరు రైల్వే సిబ్బంది లైంగికదాడికి తెగబడటం విస్మయం కలిగిస్తోంది. ఢిల్లీ-రాంచీ రాజధాని ఎక్స్ప్రెస్లో జరిగిన ఘటన రైల్వేలో మహిళల భద్రతను ప్రశ్నిస్తోంది. దీనిపై రైల్వేశాఖ స్పందించి .. చేతులు దులుపుకునే ప్రయత్నం కూడా చేసింది.
రైలులో ఆ పని ..
ఢిల్లీ నుంచి రాంచీకి రాజధాని ఎక్స్ప్రెస్ బయల్దేరింది. అందులో ఓ యువతి ఒక్కరే ఉన్నారు. అయితే ఆమెతో ఎవరూ లేరని ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ గమనించాడు. ఇంకేముంది పాంట్రీ సిబ్బందితో కలిసి వ్యుహారచన చేశాడు. ఆమెతో మాటలు కలిపారు. వీరి దుర్భుద్ది తెలియని యువతి మాట్లాడటమే తప్పయిపోయింది. ఆమె తమతో మూవ్ అవుతుంది కదా అని ఐస్ క్రీమ్ ఇచ్చారు. సాధారణంగా రైళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే తినుభాండారాలు తీసుకోవద్దు. కానీ ఆమె వారిని నమ్మి తీసుకున్నది. కొద్దీగా ఐస్ క్రీమ్ తినడంతో .. మత్తులోకి జారుకుంది. ఇంకేముంది వారి పని సులువు అయిపోయిందని వారు భావించారు. ఎవరూ లేని ఒంటరి యువతిపై లైంగికదాడికి ప్రయత్నించారు.
ఆదమరచి ..
వెంటనే తేరుకున్న యువతి వారిని అడ్డుకుంది. ఇదేం పని అని మండిపడింది. దీంతో వారు తమ పప్పులు ఉడకవని భావించి మెల్లగా జారుకున్నారు. రైళ్లో తనకు ఎదురైన ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రైల్వే సిబ్బంది తనపై లైంగికదాడి చేయబోరని ట్విట్టర్లో రాసుకొచ్చారు. తనలా మరొకరికి ఇలా జరగొద్దని సూచించారు. ఆ రైల్వే సిబ్బందిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ..వారు స్వేచ్చగా తిరుగుతారని ఆ యువతి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ను రైల్వే మంత్రి, ఇతర సీనియర్ అధికారుల ట్యాగ్ చేశారు. దీనిపై సంబంధిత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై రైల్వేశాఖ స్పందించారు. మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని .. మీకు జరిగిన ఘటనపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే రైల్వే ఏవో నేతృత్వంలో విచారణ జరుగుతుందని స్పష్టంచేశారు.
భద్రత ఏదీ ..?
సాధారణంగా రైళ్లో ఎక్కువ భద్రత ఉంటుంది. ఆయా మార్గంలో పయనించే రైలు కోసం గార్డులను కూడా కేటాయిస్తారు. కానీ రైలులోనే యువతిపై లైంగికదాడి యత్నం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఓ బెర్త్లో తమ సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తే గార్డులు ఏం చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత అంటే లెక్కలేదా అనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన జరిగి రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేసినా వెలుగులోకి రాలేదు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో .. చిన్న నుంచి పెద్ద వరకు రైల్వేశాఖ అధికారులు స్పందించారు. విచారణకు ఆదేశించామని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అంటే రైలులో సరైన భద్రత ఉండదు, పైగా సిబ్బందే అసభ్యంగా ప్రవర్తిస్తారు. కంప్లైంట్ చేసినా పట్టించుకోరు. చివరికి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రియాక్టవుతారు. ఇదీ మన రైల్వే ఉన్నతాధికారుల వైఖరి అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.