బుర్ఖా ధరించిందని బయటకు పంపారు..గోల్డ్ మెడల్ తిరిగిచ్చేసిన విద్యార్థిని
పుదుచ్చేరి: పాండిచ్చేరి యూనివర్శిటీలో గోల్డ్మెడల్ పొందిన రబీహా అబ్దురెహీమ్ అనే విద్యార్థినికి అవమానం జరిగింది. పాండిచ్చేరి యూనివర్శిటీలో కాన్వొకేషన్ సెరెమొనీ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరయ్యారు. అయితే ఈ ఫంక్షన్కు రబీహా హాజరుకావాల్సి ఉండగా ఆమెను భద్రతా సిబ్బంది ప్రవేశ మార్గం వద్దే అడ్డుకున్నారు. రబీహా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని కావడంతో హిజబ్ ధరించింది. బుర్ఖాను తీసివేయాల్సిందిగా భద్రతా సిబ్బంది విద్యార్థినిని కోరింది. బుర్ఖాను తొలగించేందుకు రబీహా ససేమిరా అని చెప్పడంతో ఆమెను లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు.
ఇతర విద్యార్థులతో పాటుగా ఆడిటోరియంలో కూర్చొని ఉండగా బుర్ఖా ధరించి ఉందన్న కారణంతో భద్రతా సిబ్బంది బయటకు వెళ్లాల్సిందిగా చెప్పిందని రబీహా వెల్లడించింది. ఇక ఓ వైపు కార్యక్రమం జరుగుతుండుగా మరోవైపు బుర్ఖాను తొలగించాల్సిందిగా భద్రతా సిబ్బంది తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఆమె ససేమిరా అని చెప్పడంతో భద్రతా సిబ్బంది ఆమెను బయటనే నిల్చోపెట్టారు. కార్యక్రమం తర్వాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వెళ్లిపోయారు .
రాష్ట్రపతి వెళ్లిపోయాక యూనివర్శిటీ స్టాఫ్ మిగిలిన విద్యార్థులకు సర్టిఫికేట్లను ఇచ్చింది. సిబ్బంది గోల్డ్మెడల్, మరియు సర్టిఫికేట్లు ఇచ్చిన సమయంలో రబీహా వాటిని తిరస్కరించింది. తనను బహిరంగంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గోల్డ్ మెడల్ తిరిగిచ్చేసిన రబీహా కేవలం సర్టిఫికేట్ను మాత్రమే తీసుకుంది. సర్టిఫికేట్ను మాత్రమే తీసుకున్న రహీబా దేశంలో పౌరసత్వ సవరణ చట్టంకు నిరసనలు తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా తాను నిలబడతానని చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే బయట ఏం జరిగిందో తమకు తెలియదని యూనివర్శిటీ అధికారులు తెలిపారు. ఫంక్షన్ చాలా బాగా జరిగిందని చెప్పారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాండిచ్చేరి యూనివర్శిటీ కాన్వొకేషన్కు వస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంను విద్యార్థి సంఘాలు బహిష్కరించాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామిలు కూడా అతిథులుగా హాజరయ్యారు.