కలకలం రేపుతోన్న ఇంజనీరింగ్ విద్యార్థి హత్య.. మాజీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్..
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. లక్నోలోని గోమతి నగర్లో గురువారం సాయంత్రం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బైక్స్పై వచ్చిన 20-25 మంది యువకులు కత్తులతో అతన్ని పొడిచి హత్య చేశారు. హత్యానంతరం చప్పట్లు కొట్టుకుంటూ.. సంతోషంతో అరుస్తూ అక్కడినుంచి పారిపోయారు. హత్య కేసుతో సంబంధం ఉన్న ఓ ఎమ్మెల్యే కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
స్నేహితుడిని కలిసేందుకు వెళ్లగా..
లక్నోలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న ప్రశాంత్ సింగ్(23) గురువారం సాయంత్రం 4గంటలకు ఇన్నోవా కారులో గోమతి నగర్లోని అలకనంద అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నాడు. ఓ స్నేహితుడిని కలిసేందుకు అతను అక్కడికి వెళ్లాడు. ఇంతలో బైక్స్పై అక్కడికి చేరుకున్న 20-25 మంది యువకులు అతనిపై కత్తులతో దాడి చేశారు.
అక్కడికక్కడే మృతి
దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రశాంత్ అపార్ట్మెంట్ లోపలికి పరిగెత్తే ప్రయత్నం చేశాడు. అయితే తీవ్ర రక్తస్రావం కారణంగా మెట్ల పైనే కుప్పకూలి చనిపోయాడు. అతను చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత.. ఆ గ్యాంగ్ గట్టిగా చప్పట్లు కొడుతూ,సంతోషంతో కేకలు వేస్తూ అక్కడినుంచి పారిపోయారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
Recommended Video
మాజీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్..
అపార్ట్మెంట్ ఎదుట ఉన్న సీసీటీవి ఫుటేజీని పరిశీలించిన పోలీసులు పలువురి వివరాలు సేకరించారు. ప్రశాంత్ను హత్య చేసినవారిలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు అమన్ బహదూర్ ఉన్నట్టు గుర్తించారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి ప్రశాంత్కు ఆ గ్యాంగ్కు మధ్య గొడవ జరిగిందని.. దానికి ప్రతీకారంగానే అతన్ని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.