కలకలం: విద్యార్థి నాయకుడిని కాల్చిచంపి హాస్టల్ ముందే పడేసిన దుండగులు
వారణాసి: ఉత్తర్ ప్రదేశ్లో మళ్లీ తుపాకుల శబ్దం వినిపించింది. అయితే ఈసారి ఏ అధికారపక్షం నాయకుడో లేక ప్రతిపక్షం పార్టీకి చెందిన వ్యక్తో మృతి చెందలేదు. కొందరు దుండగులు పేల్చిన తూటాలకు ఓ విద్యార్థి నాయకుడు బలయ్యాడు. ఈ విషాద ఘటన వారణాసిలోని ఉదయ్ ప్రతాప్ కాలేజీ క్యాంపస్లో చోటుచేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళితే... వారణాసిలోని ఉదయ్ ప్రతాప్ కాలేజీలో చదువుతున్న 22 ఏళ్ల విద్యార్థి వివేక్ సింగ్ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు తుపాకులతో కాల్చి చంపారు. వివేక్ సింగ్ బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. అజామ్ఘఢ్ జిల్లా జమూన్డీ గ్రామం ఆయన సొంత ఊరు. కాలేజీ క్యాంపస్లోనే ఈ హత్య జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వివేక్సింగ్ శరీరంలోకి ఎనిమిది తూటాలు దిగడంతో ఆయన అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయి మృతి చెందాడు.
రక్తపుమడుగులో పడిపోయిన వివేక్సింగ్ను అటుగా వెళుతున్న మరో విద్యార్థి గమనించి విషయాన్ని ఇతర విద్యార్థులకు ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చాడని ఎస్ఎస్పీ ఆనంద్ కుల్కర్ణి తెలిపారు. వివేక్ సింగ్పై ఎనిమిది సార్లు దుండగులు .32 ఎంఎం పిస్టోల్తో కాల్పులు జరిపినట్లు కుల్కర్ణి తెలిపారు. వివేక్సింగ్ను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
నిందితులను పట్టుకునేందుకు ఏడు బృందాలుగా విడిపోయి పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థి నాయకుడు వివేక్ సింగ్ హత్యకు గురికావడంతో క్యాంపస్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. విద్యార్థులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వారిని సముదాయించేందుకు జిల్లా కలెక్టర్ సురేంద్ర సింగ్ క్యాంపస్కు వెళ్లారు. ప్రస్తుతం క్యాంపస్ పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోయింది.