ప్రియురాలి ఇంటికెళ్లి..గొంతుకోసి: అదే కత్తితో తనను తాను పొడుచుకుని.. !
తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమవారం దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తన ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసిన ఓ యువకుడు.. తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరువనంతపురంలోని కరకోణంలో ఈ ఘటన సంభవించింది. వారిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల వల్లే అతను ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతుల పేర్లు అను, అషిత. అను తిరువనంతపురంలో ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. అషిత స్థానికంగా బ్యూటీషియన్ కోర్సును అభ్యసిస్తోంది. ఆమె తల్లిదండ్రులిద్దరూ ప్రైవేటు ఉద్యోగులు. అను, అషిత మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఏడాదికాలంగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కొంతకాలం కిందట వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీనితో అషిత.. తన ప్రియుడికి దూరంగా ఉండసాగింది. అతను పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ.. స్పందించేది కాదు.
దీనితో ఆగ్రహానికి గురైన అను ఈ ఉదయం కరకోణంలో ఉండే ఆమె నివాసానికి వెళ్లాడు. ఆ సమయంలో అషిత తల్లిదండ్రులు ఇంట్లో లేరు. అషితతో ఘర్షణ పడ్డ అను.. ఆగ్రహానికి గురయ్యాడు. వంటగదిలో కూరగాయలు తరిగే కత్తితో అషితపై దాడి చేశాడు. గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం భయాందోళనలకు గురైన అను.. అదే కత్తితో తనను తాను పొడుచుకుని మరణించాడు.
అషిత ఇంట్లో నుంచి కేకలు వినిపించడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటానా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు గల కారణాలేవీ స్పష్టంగా తెలియ రావట్లేదని పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య నెలకొన్న మనస్పర్థల వల్లే అను ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని ప్రాథమికంగా నిర్దారించినట్లు చెప్పారు.