గ్యాంగ్ రేప్..? హైవే పక్కన.. దేహమంతా కాలిన గాయాలతో నగ్నంగా బీఏ విద్యార్థిని...
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. బీఏ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థిని రోడ్డు పక్కన నగ్నంగా, దేహమంతా కాలిపోయిన స్థితిలో కనిపించింది. శరీరంపై 72శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం లక్నో ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తనపై గ్యాంగ్ రేప్కు యత్నించిన ముగ్గురు వ్యక్తులు... తాను గట్టిగా ప్రతిఘటించడంతో కిరోసిన్ పోసి నిప్పింటించారని బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. అయితే బాధితురాలు మళ్లీ మాట మార్చిందని పోలీసులు పేర్కొనడం గమనార్హం.
ఇలా వెలుగులోకి...
ఉత్తరప్రదేశ్లోని రాయ్ ఖేడా గ్రామ సమీపంలోని షాజహన్పూర్ నేషనల్ హైవే పక్కన గుర్తు తెలియని యువతి కాలిన గాయాలతో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఒంటిపై దుస్తులు లేని స్థితిలో,శరీరమంతా కాలిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని యువతిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆపై మెరుగైన వైద్యం కోసం లక్నో ఆస్పత్రికి తరలించారు.
గ్యాంగ్ రేప్కు యత్నించిన నిందితులు..
ఘటనపై ఎస్పీ ఆనంద్ మాట్లాడుతూ... ముగ్గురు వ్యక్తులు తనపై గ్యాంగ్ రేప్కు యత్నించినట్లు బాధితురాలు తన వాంగ్మూలంలో చెప్పిందన్నారు. తాను గట్టిగా ప్రతిఘటించడంతో కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు చెప్పిందన్నారు. అదే సమయంలో... అసలు కాలేజీ నుంచి ఆస్పత్రి వరకూ తాను ఎలా వచ్చానో తనకే తెలియట్లేదని ఆమె మాట మార్చిందన్నారు. దీనిపై లోతుగా విచారించేందుకు పోలీసులు యువతి చదువుతున్న కాలేజీలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
సీసీటీవీ ఫుటేజీలో...
సీసీటీవీ ఫుటేజీలో... కాలేజీ మూడో అంతస్తులో ఉన్న క్లాస్రూమ్ బయట ఆ యువతి తన స్నేహితులతో మాట్లాడటం కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత 20 నిమిషాలకు ఆ యువతి కాలేజీ పరిసరాల నుంచి ఓ కూలిన గోడను దాటుకుని బయటకు వెళ్లిందన్నారు. ఓ కెనాల్ వెంట యువతి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడం సీసీటీవీలో రికార్డయిందన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. కాలిన గాయాలతో నగ్నంగా రోడ్డు పక్కన పడివున్న ఆ యువతిని మొదట ఆసిఫ్ అలీ అనే వ్యక్తి గుర్తించాడన్నారు.
విద్యార్థులను ప్రశ్నించిన పోలీసులు
ఘటనకు సంబంధించి ఆ యువతి చదువుతున్న స్వామి సుఖ్దేవానంద్ కాలేజీలో ఆమె స్నేహితురాళ్లు సహా పలువురు విద్యార్థులను ప్రశ్నించినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసును చేధించేందుకు మూడు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలిక చికిత్స పొందుతున్న లక్నో ఆస్పత్రి వద్ద డిప్యూటీ ఎస్పీ నేత్రుత్వంలో ఐదుగురు పోలీసులను అక్కడ ఉంచినట్లు చెప్పారు. కాగా,స్వామి సుఖ్దేవానంద్ కాలేజీ స్వామి చిన్మయానంద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. బీజేపీ నేత,మాజీ కేంద్రమంత్రి చిన్మయానంద్పై గతంలో ఓ న్యాయశాస్త్ర విద్యార్థిని లైంగిక దాడి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిన్మయానంద్ను పోలీసులు అరెస్ట్ చేయగా... ఐదు నెలలు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆమె కేసును ఉపసంహరించుకోవడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.