ఆ ప్రదేశం ఇండియాలో లేదు: జమ్మూకాశ్మీర్ యువకుడికి షాకిచ్చి, సాయం చేసిన సుష్మా
న్యూఢిల్లీ: ఆపదలో ఉన్నామని ట్వీట్ చేస్తే చాలు వెంటనే వారికి సాయమందేలా చూస్తారు మన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా.. తన దృష్టికి వచ్చిన వెంటనే వారికి సాయపడుతూ ప్రశంసలందుకుంటున్న సుష్మా స్వరాజ్కి జమ్మూకాశ్మీర్కు చెందిన ఓ యువకుడు కోపం తెప్పించాడు.
వివరాల్లోకి వెళితే... జమ్మూకాశ్మీర్కు చెందిన షేక్ అతీక్ తనకు సాయం కావాలని సుష్మాను కోరాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అతడు పేర్కొన్న ప్రదేశమే వివాదాస్పదంగా మారింది.
సాయం కావాలంటూ..
‘నేను జమ్మూకాశ్మీర్కు చెందిన వ్యక్తిని. ఫిలిప్పీన్స్లో వైద్య విద్యనభ్యసిస్తున్నాను. నా పాస్పోర్టు దెబ్బతినడంతో నెల రోజుల క్రితం కొత్తదాని కోసం దరఖాస్తు చేసుకున్నాను. నా ఆరోగ్యం బాగా లేనందున ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు నాకు తప్పక సాయం చేయాలి' అంటూ అతీక్ ట్వీట్ చేశాడు.
చురకంటించిన సుష్మా
కాగా, అతడి ప్రొఫైల్ను చెక్ చేసిన సుష్మా స్వరాజ్.. ‘మీరు జమ్మూకాశ్మీర్కు చెందిన వ్యక్తి అయితే.. మీకు తప్పక సాయం చేస్తాము. కానీ మీ ప్రొఫైల్లో మీరు భారత ఆక్రమిత కాశ్మీర్కు చెందిన వారని ఉంది. భారత్లో అయితే అలాంటి ప్రదేశం లేదు' అంటూ చురకంటించారు.
సాయం చేయొద్దంటూ నెటిజన్లు..
ఈ నేపథ్యంలో ఒక విదేశాంగ మంత్రిగా అతడికి సాయపడాల్సిన అవసరం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, చాలా మంది నెటిజన్లు ఇలాంటి వ్యక్తులకు ఎటువంటి సాయం చేయవద్దంటూ కోరారు. ఇక్కడి తిండి తింటూ, ఇక్కడి నీళ్లు తాగుతూ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఇలాంటి వ్యక్తికి సాయం చేయకపోవడమే మంచిదని పేర్కొన్నారు.
ఇప్పుడు భారతీయుడే కాబట్టి..
సుష్మాతోపాటు నెటిజన్ల స్పందనతో కంగుతిన్న అతీక్ వెంటనే తన ప్రొఫైల్ లొకేషన్ మార్చాడు. ఈ విషయాన్ని గమనించిన సుష్మా.. ‘ నీ ప్రొఫైల్ మార్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. జయదీప్.. ఇతను(అతీక్) జమ్మూకాశ్మీర్కు చెందిన భారతీయడు. కాబట్టి ఇతడికి సాయం చేయండి' అంటూ అధికారులను కోరుతూ మరో ట్వీట్ చేశారు. దీంతో అతీక్ సమస్యకు పరిష్కారం లభించినట్లయింది.