ఆ కాలేజీలో పాకిస్తాన్ జెండాలు... ఉగ్రవాదులు నక్కి ఉన్నారా..?
కోజికోడ్: కాలేజీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడంతో వారిని అరెస్టు చేసిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. కోజికోడ్లోని పెరంబ్రా సిల్వర్ కాలేజీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముస్లిం స్టూడెంట్ ఫ్రంట్ విద్యార్థి సంఘం కాంగ్రెస్ మద్దతుగా ఉన్న కేరళ స్టూడెంట్స్ యూనియన్ల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. ముస్లిం స్టూడెంట్స్ ఫ్రంట్, కేరళ స్టూడెంట్ యూనియన్ విద్యార్థులు పాకిస్తాన్ జెండాను ప్రదర్శించారు.
పాకిస్తాన్ జెండా ప్రదర్శిస్తున్న 25 మంది విద్యార్థులపై ఐపీసీ సెక్షన్ 143, 147,153,149 కేసులను నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ముస్లిం స్టూడెంట్ ఫ్రంట్ విద్యార్థుల మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. తమ జెండా పాకిస్తాన్ జెండాను పోలి ఉంటుందని చెబుతున్నారు. తమ జెండా తలకిందులుగా చూస్తే పాక్ జెండాలా ఉంటుంది తప్పితే అది పాకిస్తాన్ జెండా కాదని చెప్పారు.
విద్యార్థి ఎన్నికలు కాస్త రాజకీయ రంగును పులుముకున్నాయి. కాలేజీ క్యాంపస్లోకి ఉగ్రవాదులు చొరబడి ఉంటారన్న అనుమానంను భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరింపించాలని డిమాండ్ చేశారు.