బుల్లెట్-కారు ఢీ: కాలేజ్ విద్యార్థినీ విద్యార్థి దుర్మరణం: చిన్న క్లూ లేదు, పోలీసులకు సవాల్ !
బెంగళూరు: ప్రసిద్ది చెందిన చాముండేశ్వరి కొండ మీద అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన కాలేజ్ విద్యార్థుల బుల్లెట్ ను ఢీకొని ఇద్దరి మరణానికి కారణం అయిన కారు కోసం కర్ణాటకలోని మైసూరు జిల్లా పోలీసులు గాలిస్తున్నారు.
మైసూరు-ఊటీ రోడ్డులోని జేఎస్ఎస్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్న అరవింద్ రావ్ (22), ఎంసి. నమన (21) అనే యువతి ఈనెల 5వ తేదీ గురువారం kA-09- HL 7829 నెంబర్ బుల్లెట్ లో ప్రసిద్ది చెందిన చాముండేశ్వరి కొండ మీద అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్లారు.
అమ్మవారిని దర్శనం చేసుకున్న అరవింద్ రావ్, నమన తిరిగి కొండ మీద నుంచి కిందకు బయలుదేరారు. మార్గం మధ్యలో వాచ్ టవర్ సమీపంలో వేగంగా వచ్చిన కారు వీరి బుల్లెట్ ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో అరవింద్ రావ్ సంఘటనా స్థలంలో దుర్మరణం చెందాడు.
తీవ్రగాయాలైన నమనను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే బ్రైన్ డెడ్ అయిన నమన మరణించింది. నమన గుండె, కిడ్నీలు తదితర అవయవాలను ఆమె సోదరుడు నవీన్ దానం చేశాడు. ఇద్దరు విద్యార్థుల మరణానికి కారణం అయిన వ్యక్తులు కారుతో సహ పరారైనారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఎవ్వరూ చూడకపోవడంతో ఇంత వరకూ కారు, వాహనం నడిపిన వ్యక్తి వివరాలు చిక్కలేదు. అయితే సంఘటనా స్థలంలో పోలీసులకు కారు సైడ్ మిర్రర్, వాహనం బానెట్ పగిలిన చిన్న ముక్కలు మాత్రం చిక్కాయి.
ఈ కేసును మైసూరు నగర పోలీసు కమిషనర్ డాక్టర్ సుబ్రమణ్యేశ్వర్ రావ్ సీరియస్ గా తీసుకున్నారు. డీసీపీ డాక్టర్ విష్ణువర్దన్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కారు ఆచూకికోసం వేట మొదలు పెట్టారు. కారు అద్దం, బానెట్ ముక్కలు తీసుకుని కారు షోరూంల్లో విచారణ మొదలు పెట్టారు.
కారు హుండై కంపెనీకి చెందిన క్రేటా కారు అని పోలీసులు గుర్తించారు. మైసూరు జిల్లాలో ఆ మోడల్ కారు ఎవరెవరు కొనుగోలు చేశారు ?, ఏదైనా షోరూంలో రిపేర్ చేయించారా ? అని ఆరా తీస్తున్నారు. మైసూరు జిల్లాతో పాటు బెంగళూరు, మండ్య జిల్లాల్లో విచారణ ముమ్మరం చేశారు. ఇద్దరు అమాయక విద్యార్థుల దుర్మరణానికి కారణం అయిన వారిని వెంటనే పట్టుకోవాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.