బస్డే సెలబ్రేషన్స్లో అపశృతి: ఏమిటీ వేడుకలు... ప్రమాదం ఎలా జరిగింది..?
చెన్నై: చెన్నైలో కాలేజీ విద్యార్థులు బస్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సోమవారం బస్ డే వేడుకల్లో భాగంగా కాలేజీ విద్యార్థులు ఓ బస్సు టాప్ ఎక్కి కూర్చున్నారు. బస్సు లోపల కూడా విద్యార్థులతో పూర్తిగా నిండిపోయింది. మరికొందరు బయటకు వ్రేలాడారు. ఇక బస్సు కదిలింది. కదిలి కొంత ముందుకువెళ్లగానే బస్సు డ్రైవర్ బ్రేకులు వేయడంతో బస్సుపైన ఉన్న విద్యార్థులంతా ఒక్కసారిగా కిందకు పడ్డారు. దాదాపు 30 మంది విద్యార్థులు కిందకు పడ్డారు.
బస్సుపై నుంచి విద్యార్థులు కిందపడ్డారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ఇందులో 20 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. పబ్లిక్ న్యూసెన్స్ కింద వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. బస్ డే వేడుకల పేరుతో ప్రాణాలతో చెలగాటం ఆడారు. నిబంధనలకు విరుద్ధంగా స్టూడెంట్స్ బస్సు ఎక్కి బహిరంగంగా రోడ్డుపై ఇలా ప్రయాణించడం చాలా మందికి ఇబ్బంది గురిచేసింది.
ప్రతి వేసవి సెలవుల తర్వాత తొలిరోజు కాలేజీలు తెరుచుకున్ననాడు బస్ డే వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ కాలేజీ విద్యార్థులు మాత్రం వారిమాట వినకుండా బస్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సారి కూడా అదే వేడుకలో బస్సుపైకి ఎక్కి స్టంట్స్ చేసే ప్రయత్నం చేశారు. పచయప్పా కాలేజ్ మరియు అంబేడ్కర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులు చెన్నై ప్రధాన రహదారిపై బస్ డే వేడుకలు నిర్వహించారు. బస్సు పై నుంచి కిందపడటం అక్కడే ఉన్న కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోస్టు చేసిన కొద్ది సమయంలోనే వీడియో వైరల్ అయ్యింది.
బస్ డే వేడుకల్లో అపశృతి: కదులుతున్న బస్సుపై నుంచి పడ్డ విద్యార్థులు#Busday pic.twitter.com/KhYrtJXEbu
— Oneindia Telugu (@oneindiatelugu) June 18, 2019
కొత్తగా జాయిన్ అయ్యే విద్యార్థులను సీనియర్ విద్యార్థులు బస్ డే వేడుకలను నిర్వహించాలని పురమాయించినట్లు పోలీసులు తెలిపారు. బస్సుపైకి ఎక్కి గ్రూపు ఫోటోలు దిగారు .దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. హైకోర్టు కూడా బస్ డే వేడుకలపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ విద్యార్థుల్లో మాత్రం ఎలాంటి చలనం రాలేదు. ఇక ఈ ఘటనలో 24 మందిని పోలీసులు గుర్తించడం జరిగింది. వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.