చైనా టు చెన్నై: కమ్యూనిస్టు దేశాధ్యక్షుడికి తమిళనాడు విద్యార్థుల వినూత్న స్వాగతం
చెన్నై: చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ భారత పర్యటన మరి కొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. రెండు రోజుల పర్యటన కోసం జిన్ పింగ్ గురువారం సాయంత్రం చెన్నైకి చేరుకోనున్నారు. చైనా రాజధాని బీజింగ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన నేరుగా చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి చైన్నై శివార్లలోని మామళ్లాపురం పట్టణానికి బయలుదేరి వెళ్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో శుక్రవారం ఉదయం ఇదే పట్టణంలో సమావేశమౌతారు. జిన్ పింగ్ కాన్వాయ్ వాహనాలు బుధవారమే చెన్నైకి చేరుకున్నాయి. ఆ వాహనాల్లోనే ఆయన ప్రయాణిస్తారు.
భారత్ కు రెండోసారి..
ఆసియాలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా పేరు తెచ్చుకున్న చైనాకు సారథ్యాన్ని వహిస్తోన్న జిన్ పింగ్.. భారత పర్యటనకు రావడం ఇది రెండోసారి. దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతుండటం తొలిసారి. సముద్రతీర ప్రాంతమైన మామళ్లాపురంలో భేటీ కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మామళ్లాపురంలో పూర్తయ్యాయి. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జిన్ పింగ్ సహా ఆయనతో పాటు వచ్చే అధికారుల బృందానికి అక్కడే బసను ఏర్పాటు చేశారు.
జిన్ పింగ్ మాస్క్ లతో..
తొలిసారిగా తమ రాష్ట్రానికి రానున్న జిన్ పింగ్ కు చెన్నై విద్యార్థులు వినూత్నంగా స్వాగతం పలుకుతున్నారు. చెన్నైలోని ఓ కళాశాల విద్యార్థులు జిన్ పింగ్ మాస్క్ లను ధరించారు. జిన్ పింగ్ భారీ చిత్రపటాన్ని తమ కళాశాల మైదానంలో ఆవిష్కరించారు. ఆ చిత్రపటం ముందు చైనా లిపిలో స్వాగతం పలుకుతూ ఆసీనులయ్యారు. సుమారు 2000 మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఏ దేశాధ్యక్షుడైనా సరే.. తమ రాష్ట్రానికి తొలిసారిగా రాబోతుండటం పట్ల ఆనందంగా ఉందని, పైగా ఆసియాలో అత్యంత శక్తిమంతమైన చైనా దేశాధ్యక్షుడే రాబోతుండటం గర్వకారణంగా ఉందని విద్యార్థులు వ్యాఖ్యానిస్తున్నారు.
చర్చలకు మాత్రమే పరిమితం..
చైనా దేశాధ్యక్షుడి స్వయంగా భారత పర్యటనకు వస్తున్నారంటే.. రెండు దేశాల మధ్య వాణిజ్య, దౌత్య పరమైన కీలక ఒప్పందాలు చోటు చేసుకోవచ్చంటూ ఊహాగానాలు చెలరేగడం సహజం. వాటన్నింటినీ భారత్ లోని చైనా రాయబార కార్యాలయం అధికారులు ముందే తోసిపుచ్చారు. రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు ఉండబోవని తేటతెల్లం చేశారు. జిన్ పింగ్, నరేంద్ర మోడీ సంయుక్త విలేకరుల సమావేశం కూడా ఉండదని నిర్ధారించారు. ఈ రెండూ తమ దేశాధ్యక్షుడి భారత పర్యటన షెడ్యూల్ లో లేవని చైనా రాయబార కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు.
పాకిస్తాన్ వైపు చైనా..
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత జిన్ పింగ్ భారత పర్యటనకు రాబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్ ను రెండుగా విభజించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం మన పొరుగుదేశం పాకిస్తాన్ ఏ మాత్రం ఇష్టం లేదు. ఆర్టికల్ 370 రద్దు వ్యవహారాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వంటి ప్రపంచ స్థాయి అత్యున్నత వేదికల మీద ప్రస్తావనకు తీసుకొచ్చి చేదు ఫలితాలను చవి చూసింది. మనదేశంతో పోల్చుకుంటే చైనాకు పాకిస్తాన్ తోనే స్నేహ సంబంధాలు అధికం.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా కూడా ఆర్టికల్ 370 రద్దు వ్యవహారంలో పాకిస్తాన్ కు సహాయ, సహకారాన్ని అందజేయలేకపోయింది. లాంటి పరిస్థితుల మధ్య జిన్ పింగ్ భారత పర్యటనకు రాబోతుండటం, పైగా ఒప్పందాలేవీ చోటు చేసుకోవడం వంటి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.