కరోనాలో నీట్, జేఈఈ పరీక్షలా ? విద్యార్ధుల్లో తీవ్ర వ్యతిరేకత- రేపు ఇళ్ల వద్దే దీక్షలు..
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్ధలను తిరిగి ప్రారంభించడంపై తీసుకుంటున్న నిర్ణయాలే కాక రేపుతున్నాయి. ఇప్పటికే కేంద్రం నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విద్యార్ధుల తల్లితండ్రులు కూడా భగ్గుమంటున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్ధలు తమ ప్రవేశ పరీక్షలను వాయిదా వేశాయి. ఇదే కోవలో జాతీయ స్ధాయి ప్రవేశపరీక్షలు కూడా వాయిదా వేయడం లేదా రద్దు చేయాలనే డిమా్ండ్లు ఊపందుకున్నాయి.
కానీ జాతీయ స్ధాయి టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మాత్రం నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేసేందుకు ససేమిరా అంటోంది. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ప్రతిష్టాత్మక పరీక్షలను వాయిదా వేయరాదని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారమే ఈ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విద్యార్ధులు భగ్గుమన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిరసనలు చేపడుతున్న విద్యార్ధులు.. రేపు ఇళ్ల వద్దే దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. రేపు ఉదయం 8 గంటలకు నలుపు రంగు మాస్కులు, జెండాలతో దీక్షలు ప్రారంభిస్తామని పలు విద్యార్ధి సంఘాలు కూడా ప్రకటించాయి.
కరోనా ప్రభావం ఉన్నప్పటికీ నీట్, జేఈఈ పరీక్షలు మాత్రం నిర్వహించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. విపక్ష పార్టీల సీఎంలతో ఆమె అఖిలపక్ష భేటీ కూడా నిర్వహించారు. వాస్తవానికి ఈ పరీక్షలు సెప్టెంబర్ 1న ప్రారంభం కావాల్సి ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా నీట్, జేఈఈ పరీక్షలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతుండగానే నీట్ పరీక్ష అడ్మిట్ కార్డులను కూడా అధికారులు విడుదల చేయడం కలకలం రేపుతోంది.