ప్రైవేట్ స్కూళ్లు వద్దు.. సర్కారు బడులే ముద్దు.. అక్కడ అడ్మిషన్ కోసం క్యూలు కడుతున్న పేరెంట్స్..
మేవట్ : రెక్కలు ముక్కలు చేసుకునైనా పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు ఆరాటపడతారు. పదేళ్ల క్రితం వరకు అక్కడ కూడా అదే సీన్ కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలను సర్కారీ బడిలో చేర్పించేందుకు పేరెంట్స్ నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కోసం క్యూ కడుతున్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన హర్యానాలోని మేవట్లో ఒకప్పుడు విద్యార్థులు లేక బోసిపోయిన సర్కారీ బడులు ఇప్పుడు పిల్లలతో కిటకిటలాడుతున్నాయి.
నాణ్యమైన విద్య
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు ఉండవు. పిల్లలు ఉన్న చోట టీచర్లు ఉండరు. ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు కనిపించరు. కానీ మేవట్లో మాత్రం ఏ ప్రభుత్వ పాఠశాల చూసిన విద్యార్థులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. అందుకు కారణం అక్కడ పనిచేసే టీచర్ల చిత్తశుద్ధి, అంకితభావం. మేవట్లో సర్కారీ స్కూళ్లు ఏ ప్రైవేట్ పాఠశాలకు తీసిపోవు. మౌలిక సదుపాయాల కల్పన నుంచి విద్యాబోధన వరకు అన్ని విషయాల్లోనూ చొరవ తీసుకునే అక్కడి టీచర్లు బలమైన విద్యా వ్యవస్థకు పునాదులు వేశారు. దీంతో ఆ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.
పదేళ్ల క్రితం వరకు అధ్వానం
దశాబ్దం క్రితం వరకు మేవట్లో పరిస్థితి అన్ని సర్కారీ బడుల్లాగే ఉండేది. అప్పట్లో కనీస సదుపాయాలు లేని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు రూపురేఖల్ని మార్చుకున్నాయి. కనీసం గేట్లు లేని పాఠశాలల్లో ఇప్పుడు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నారు. 2018లో మేవట్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతం 97శాతంగా నమోదైందంటే అక్కడి విద్యార్థులకు ఎంత నాణ్యమైన విద్య అందుతోందో అర్థం చేసుకోవచ్చు. అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రభుత్వం నుంచి అందే నిధులను సక్రమంగా ఉపయోగించడం వల్లే ఇది సాధ్యమైంది. పక్కా భవనాలతో పాటు ప్లే గ్రౌండ్లు, సైన్స్ ల్యాబ్లు కలిగిన పాఠశాలలు ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు తెచ్చింది.
నిధుల సక్రమ వినియోగం
కాంపిటీటివ్ స్పిరిట్తో పనిచేసే టీచర్లు వినూత్న ఐడియాలతో విద్యా విధానంలో ఎన్నో మార్పులు తెచ్చారు. అంతేకాదు వివిధ సంస్థలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీలు ఇచ్చే నిధులతో స్కూళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దీంతో క్రమంగా డ్రాపౌట్ల సంఖ్య తగ్గింది. ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు మళ్లీ సర్కారీ బడిబాట పట్టారు. హర్యానాలో అత్యంత వెనకబడిన ప్రాంతమైన మేవట్ ప్రస్తుతం విద్య విషయంలో ప్రైవేట్ స్కూళ్లకు పోటీ ఇస్తోంది. అంతేకాదు ఇక్కడ అక్షరాస్యత శాతం కూడా క్రమంగా పెరుగుతోంది. 2001లో మేవట్లో 43.5శాతంగా ఉన్న అక్షరాస్యత 2011 నాటికి 54.1శాతానికి పెరిగింది. హర్యానా సగటు అక్షరాస్యతతో పోలిస్తే ఇది తక్కువే అయినా త్వరలోనే నిరక్షరాస్యతను మరింత తగ్గిస్తామని అధికారులు ధీమాతో చెబుతున్నారు.