ఇదెలా సాధ్యం: సున్నా మార్కులతోనే ఎంబీబీఎస్ సీటు కొట్టారు
ఒక మెడికల్ కాలేజీలో విద్యార్థి సీటు సంపాదించాలంటే మామూలు విషయం కాదు. అందులో నీట్ వ్యవస్థ వచ్చాక అది మరింత కష్టతరంగా మారింది. అయితే ఓ తాజా నివేదిక కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. 2017లో జరిగిన నీట్ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో సున్నా మార్కులు, సింగిల్ డిజిట్ మార్కులు, నెగిటివ్ మార్కులు తెచ్చుకున్న 500 మంది విద్యార్థులకు మెడికల్ కాలేజీల్లో సీటు లభించడం షాక్కు గురిచేస్తోంది. ఇందులో 400 మంది విద్యార్థులకు సింగిల్ డిజిట్ స్కోరు రాగా,110 మంది విద్యార్థులకు సున్నా మార్కులు వచ్చాయి. ఇక మిగతా వారికి నెగిటివ్ మార్కులు వచ్చాయి. ఉదాహరణకు ఒక విద్యార్థికి ఫిజిక్స్లో 2 మార్కులు, కెమిస్ట్రీలో 4 మార్కులు, బైయాలజీలో 139 మార్కులు వచ్చి అతనికి 5.3 లక్షలకు పైగా ర్యాంకు వచ్చింది. అయినా అతనికి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు లభించింది. గతేడాది జరిగిన నీట్ పరీక్షలో 6.1లక్ష మంది విద్యార్థులు అర్హత పొందారు.
ఇందులో కూడా ఓ కిటుకు ఉంది. అంతమంది విద్యార్థులకు తక్కువగా మార్కులు వచ్చినప్పటికి కూడా సీటు లభించిందంటే అందుకు కారణం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి సెక్షన్లో 50శాతం మార్కులు అర్హత తప్పని సరి అని నిబందన పెట్టకపోవడమే. 2010 డిసెంబర్లో నీట్ నోటిఫికేషన్ ప్రకారం విద్యార్థి ప్రతీ సబ్జెక్టులో 50 శాతం మార్కులు సాధిస్తేనే అర్హత లభిస్తుంది. అయితే కాలక్రమేణా ఆ పద్ధతికి స్వస్తి పలికి పర్సంటేజ్ బదులుగా పర్సంటైల్ వచ్చి చేరింది.
తాజా విశ్లేషణ ప్రకారం 2017 నీట్ స్కోర్ ఆధారంగా మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు 1990 మంది కాగా అందులో చాలామంది 720 మార్కులకు గాను 150 మార్కులు మాత్రమే స్కోరు చేశారు. ఇందులో 530 మంది విద్యార్థులు సున్నా మార్కులు లేదా నెగిటివ్ మార్కులు, లేదా సింగిల్ డిజిట్ మార్కులను ఆయా సబ్జెక్టుల్లో స్కోరు చేశారని రిపోర్ట్ వెల్లడిస్తోంది. ఈ 530 మంది విద్యార్థుల్లో 507 మంది విద్యార్థులు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటు పొందారు.
నీట్ వ్యవస్థతో మెడికల్ కాలేజీ సీట్లు పొందడంలో పారదర్శకత లభిస్తుందని అంతా భావించిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన పర్సెంటైల్ విధానం నీళ్లు చల్లుతోంది. బాగా డబ్బున్న విద్యార్థులు అర్హత లేకున్నప్పటికీ కేవలం డబ్బును ఎరగా వేసి సీటు పొందుతున్నారన్నది స్పష్టమవుతోంది. మరోవైపు మంచి మార్కులు సాధించి కూడా కనీసం ట్యూషన్ ఫీజు (రూ.20 లక్షలు)కట్టలేని పరిస్థితుల్లో కొందరు విద్యార్థులున్నారు. అయితే విద్యావేత్తలు, నిపుణులు మాత్రం పర్సంటైల్ విధానానికి స్వస్తి చెప్పాలని లేదంటే భవిష్యత్తులో ప్రమాదంగా పరిణమించే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.