బిర్యానీ అంటేనే భయపడేలా!.., తిన్నాక.. సబ్ ఇన్స్పెక్టర్ మృతి
బిర్యానీ తిని ఏకంగా ఓ పోలీస్ అధికారి తన ప్రాణాలే కోల్పోవడం కలకలం రేపుతోంది.
టి.నగర్: ఇటీవల వెలుగుచూస్తున్న పలు ఘటనలు బిర్యానీ అంటేనే భయపడాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నాయి. మొన్నటికి మొన్న చెన్నైలోని పలు షాపుల్లో కుక్క మాంసం, పిల్లి మాంసంతో తయారుచేసిన బిర్యానీ వంటకాలు వెలుగుచూడగా.. తాజాగా బిర్యానీ తిని ఏకంగా ఓ పోలీస్ అధికారి తన ప్రాణాలే కోల్పోవడం కలకలం రేపుతోంది.
తమిళనాడులోని ఉలుందూరుపేట ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కడలూరు జిల్లా పన్రుట్టి సమీపంలో ఉన్న పాత పిళ్లయార్ కుప్పం ప్రాంతానికి చెందిన షణ్ముఖవేల్ (40) ఉలుందూరు పేట పోలీసు స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు.
భార్య అరుళ్సెల్వి, కుమారుడు నరేనకార్తీక్ ఇద్దరు ఊరెళ్లడంతో ఇంట్లో ఆయన కుమార్తె కీర్తనా సబితా మాత్రమే ఉన్నారు. ఇదే క్రమంలో మంగళవారం నాడు విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన షణ్ముఖవేల్ దారిలో ఉన్న ఓ హోటల్ బిర్యానీ పార్శిల్ తీసుకున్నాడు. ఇంటికెళ్లాక కూతురుతో కలిసి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.
మరుసటిరోజు వేకువజాము నుంచే షణ్ముఖవేల్ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. ఉన్నట్టుండి తీవ్రంగా వాంతులు చేసుకోవడంతో పాటు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆయన కుమార్తె కీర్తనా సబిత ఉలుందూరు పేట పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే షణ్ముఖవేల్ ఇంటికి వచ్చిన పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు ఎంతగా ప్రయత్నించినా.. చికిత్స విఫలమవడంతో షణ్ముఖవేల్ మృతి చెందారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.