అండమాన్ నికోబార్లో సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టును లాంచ్ చేసిన మోదీ...
చెన్నై-అడమాన్ నికోబార్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా అండమాన్ నికోబార్ ద్వీపానికి ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. తద్వారా అక్కడ ఆన్లైన్ ఎడ్యుకేషన్,టూరిజం,వ్యాపార రంగం అభివృద్ది చెందనున్నాయి. ఈ ప్రాజెక్టుకు డిసెంబర్ 30,2018న పోర్టు బ్లెయిర్లో మోదీ శంకుస్థాపన చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ సేవలతో సమానమైన వేగంతో ఇక్కడ కూడా మొబైల్ ల్యాండ్ లైన్ టెలికాం సేవలను అందించనున్నారు.
ప్రాజెక్ట్ లాంచ్ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టుతో పోర్టు బ్లెయిర్ నుంచి స్వరాజ్ దీప్ వరకూ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అండమాన్ నికోబార్లోని 12 ద్వీపాలకు ఇంటర్నెట్ సేవలు అందనున్నట్లు తెలిపారు. చెన్నై,ఢిల్లీ,ముంబై తరహాలో అండమాన్ నికోబార్ కూడా ఓ పారిశ్రామిక ప్రాంతమన్న మోదీ... ఇక అండమాన్ నికోబార్ ప్రజలు వర్చువల్ ప్రపంచంతో కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. కరోనా పరిస్థితుల్లో నికోబార్లోని ప్రతీ ఒక్కరూ ఆన్లైన్ సేవలను ఉపయోగించుకునేందుకు ఇక ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ ప్రాజెక్టు లాంచ్లో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... డిజిటల్ ఇండియా,ఆత్మనిర్భర్ భారత్కి ఈ ప్రాజెక్టు నిదర్శనమన్నారు. ఈ ప్రాజెక్టును తీసుకొచ్చిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు.