ఎవరీ జై శంకర్ : నేపథ్యమేంటీ ? కేబినెట్ బెర్త్ సమర్థతకే గిటురాయా ?
న్యూఢిల్లీ : సుబ్రమణ్యం జై శంకర్ .. భారత విదేశాంగ శాఖ మంత్రి. మోడీ 2.0 టీంలో కీలక శాఖను కట్టబెట్టారు. ఇంతకీ జై శంకర్ ఎవరు ? ఆయన క్యాబినెట్ బెర్త్ దక్కడంలో అంతర్యమేంటీ ? నిబద్ధత, సమర్థతతే గీటురాయిగా మోడీ పదవీ కట్టబెట్టరా ? ఇంతకీ సుబ్రమణ్యం జై శంకర్ నేపథ్యమేంటీ ? వన్ ఇండియా ప్రత్యేక కథనం.
ఎవరీ జై శంకర్ ..
మోడీ సహా 58 మంది కేంద్రమంత్రులుగా నిన్న సాయంత్రం ప్రమాణం చేశారు. ఇందులో సుబ్రమణ్యం జై శంకర్ ఒకరు. ఇదివరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన .. జై శంకర్కు ఆ శాఖ పదవీ కట్టబెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదీ డైరెక్టుగా క్యాబినెట్ బెర్త్ లభించడం జై శంకర్ సమర్ధత ఏంటనే ప్రశ్నలకు దారితీస్తోంది.
ఇదీ నేపథ్యం ...
1955 జనవరి 9న సివిల్ సర్వెంట్ సుబ్రమణ్యం, సులోచన దంపతులకు జై శంకర్ జన్మించారు. ఇతనికీ ఇద్దరు సోదరులు ఉన్నారు. తండ్రి సివిల్ సర్వెంట్ అయినందున పిల్లలు కూడా మంచి హోదాలో పనిచేశారు. సంజయ్ సుబ్రమణ్యం అనే సోదరుడు చరిత్రకారుడు కాగా .. విజయ్ కుమార్ అనే మరో సోదరుడు గ్రామీణాభివృద్ధిశాఖలో కార్యదర్శి పనిచేసి పదవీ విరమణ చేశారు. తండ్రితో సహా అందరూ సివిల్ సర్వెంట్లుగా పనిచేసి .. మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చుకున్నారు. ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు జై శంకర్. గ్రాడ్యుయేషన్ స్టిఫెన్స్ కాలేజీలో పూర్తి చేశారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జేఎన్యూ వర్సిటీలో ఎంఎ పొలిటికల్ సైన్స్లో పీజీ, ఎంఫిల్, చేశారు. అంతర్జాతీయ సంబంధాలపై పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందారు. తర్వాత సివిల్ సర్వీసెస్ రాసి 1997లో ఐఏఎఫ్కు ఎంపికయ్యారు. చైనాకు చెందిన క్యోంకో అనే మహిళను వివాహమాడారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ధ్రువ్, అర్జున్, కూతురు మేధా. బ్రూకింగ్స్ ఇండియాలో పారిన్ విధానాలపై ధ్రువ్ చదువుతున్నారు. అర్జును ఎన్వైయూలో విద్యాభ్యాసం కొనసాగుతోంది. మేధా ఇంగ్లీషు ఆడిషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. జై శంకర్ తన మాతృభాష తమిళ్తోపాటు ఇంగ్లీష్, రష్యన్, హిందీ, మాండరియన్, జపానీస్, హంగేరియన్ భాషలు మాట్లాడగలరు.
సమర్థత, దూకుడు ..
ఫారిన్ సర్వీస్కు ఎంపికైన తర్వాత జై శంకర్ తనదైన శైలిలో దూసుకెళ్లారు. ముఖ్యంగా ఇతర దేశాలతో దైత్యపరమైన చర్చల్లో కీ రోల్ పోషించారు. తొలుత రష్యాలో భారత కార్యదర్శిగా నియమితులయ్యారు. తర్వాత అమెరికా, సింగపూర్, చైనాలో పనిచేసి మంచి దౌత్యనీతి ప్రదర్శించారు. సింగపూర్లో హై కమిషనర్గా 2007 నుంచి 2009 వరకు పనిచేశారు. ఈ సమయంలో సీఈసీఏ ఒప్పందం జరిగింది. దీంతో భారతదేశ వాణిజ్యం విభాగం మరింత బలోపేతానికి దారితీసింది. తర్వాత చైనాలో భారత రాయబారిగా దాదాపు నాలుగున్నరేళ్లు పనిచేశారు. ఈ సమయంలోనే చైనాతో భారతదేశానికి దౌత్యపరంగా మరిన్ని చర్యలు తీసుకునేందుకు దోహదపడింది. ముఖ్యంగా డోక్లాంపై .. భారత్, చైనాలో మధ్య నెలకొన్న వివాదం శాంతియుతంగా పరిష్కరించడంలో ముఖ్యభూమిక పోషించారు. డోక్లాం తమదేనిని చైనా అనడంతో పరిసరాల్లో భారత్, చైనా జవాన్లను మొహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సున్నితమైన సమస్యను భారత రాయబారిగా డ్రాగన్ చైనాతో పలు దఫాలుగా చర్చలు జరిపి .. సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టించిన దిట్ట జై శంకర్.
మార్క్ ప్రదర్శన
చైనా నుంచి అమెరికాకు మారింది జై శంకర్ మకాం. 2013లో అమెరికాలో భారత రాయబారిగా విధులు నిర్వర్తించారు జై శంకర్. ఆయన అమెరికాలో అడుగిడిన వెంటనే దేవయాని కోబ్రగడ ఘటన జరిగింది. ఆ సమస్యను తన దౌత్యనీతితో పరిష్కరించారు జై శంకర్. వివిధ అంశాలపై అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఫలప్రదం చేశారు. 2014లో మోడీ అమెరికా రావడంలో కీ రోల్ పోషించారు. తర్వాత 2015లో భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. అక్కడినుంచి నాలుగేళ్లు విభిన్న సందర్భాల్లో తన తెలివితేటలను చూపించారు. ముఖ్యంగా పుల్వామా దాడుల తర్వాత .. బాలాకోట్పై వాయుసేన దాడులు చేయడం ... పాకిస్థాన్లో చిక్కుకున్న అభినందన్ వర్ధమాన్ను భారత్ తిరిగి రప్పించడంలో జై శంకర్ అసమాన ప్రతిభ కనబరిచారు. శంకర్ ప్రతిభ పాటవాలు స్వయంగా చూసిన మోడీ ... మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శికి ఏకంగా విదేశాంగ శాఖ మంత్రి పదవీ కట్టబెట్టారు.