ఈయన ఇంతే: మాల్దీవ్ ఎన్నికలపై సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద ట్వీట్
తన వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాస్పద ట్వీట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి కాంట్రవర్శియల్ స్టేట్ మెంట్స్ చేశాడు. మాల్దీవ్ దేశానికి మరో నెలలో ఎన్నికలుండగా ఆ దేశం అంతర్గత అంశాలపై వివాదాస్పద ట్వీట్ చేశారు. మాల్దీవుల్లో జరగనున్న ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగితే భారత్ జోక్యం చేసుకుని ఆ దేశాన్ని ఆక్రమించాలని స్వామి ట్విటర్ వేదికగా పోస్టు చేశారు. అయితే దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది.
సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్తో మాల్దీవ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే భారత హైకమిషనర్ అఖిలేష్ మిశ్రాకు వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు పంపారు ఆదేశ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి అహ్మద్ సరీర్. ఈ సందర్భంగా ఆయన స్వామి ట్వీట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు భారత ప్రభుత్వానికి కూడా ఓ లేఖ స్వామి ట్వీట్స్కు సంబంధించి ఓ లేఖ రాసింది. అహ్మద్ సరీర్, అఖిలేష్ మిశ్రాల మధ్య దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. దీని తర్వాత మరో ఏడు దేశాలకు సంబంధించిన అంబాసిడర్లతో సరీర్ భేటీ అయ్యారు.
గతవారం కొలొంబోలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ను కలిసిన అనంతరం స్వామి ఈ ట్వీట్ చేశారు. అయితే స్వామి చేసిన ఆ వివాదాస్పద ట్వీట్ తన వ్యక్తిగతమని ఆ ట్వీట్తో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. మాల్దీవుల విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి అహ్మద్ సరీర్తో అఖిలేష్ మిశ్రా కూడా ఇదే విషయం చెప్పారని ఆయన వెల్లడించారు. తను నషీద్తో కలిసిన సందర్బంగా మాల్దీవులో జరగనున్న ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్కు పాల్పడేందుకు మాల్దీవ్ ప్రభుత్వం సిద్ధపడుతోందని నషీద్ తనతో చెప్పినట్లు స్వామి పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అక్కడి భారతీయులను హీనంగా చూస్తున్నారని చెప్పారు.
https://t.co/nazyiRCOKs: India should invade Maldives if rigging of election takes place
— Subramanian Swamy (@Swamy39) August 24, 2018
ఇదిలా ఉంటే స్వామి చేసిన ట్వీట్ పై మాల్దీవ్ ప్రభుత్వం మరోలా చూస్తోంది. మాల్దీవుల్లో జరిగే ఎన్నికల్లో భారత జోక్యం చేసుకుంటోందనే ప్రచారం బయట జరుగుతోందని మాల్దీవుల ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్దీవ్ దేశంలో 45 రోజుల పాటు ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే అది మంచి పరిణామం కాదని భారత్ చెప్పినప్పటికీ మాల్దీవ్ ప్రభుత్వం వినలేదు. ఇక అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు అనుకున్న స్థాయిలో లేవు. ఈ క్రమంలోనే స్వామి ట్వీట్ అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.