రామాలయం, మసీదు: స్వామి విరాట్ హిందుస్తాన్ సంఘం ఏర్పాటు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కొత్తగా హిందుత్వ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. విరాట్ హిందుస్తాన్ను (వీహెచ్ఎస్) ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హిందూత్వ అంశాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో దీనిని నెలకొల్పినట్టు ప్రకటించారు.
రామ్ మందిర్ ప్రాంతానికి రక్షణ కల్పించడం, ప్రత్యామ్నాయ స్థలాన్ని ముస్లింలు ఆమోదించేలా చూడటం వంటి అంశాలను ఈ సంస్థ చేపడుతుందన్నారు. హిందూత్వ విలువలను యువతకు బోధించడంతో పాటు ఆర్టికల్ 370, ఉమ్మడి పౌరస్మృతి, మందిరం, గోమాంస నిషేధంపై ప్రచారం చేపడుతుందన్నారు.
ఆయా అంశాలపై భారతీయ జనతా పార్టీ సర్కారుపై ఒత్తిడి తెచ్చే విధంగా సంస్థ పోరాడుతుందని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి తమ సంస్థ ప్రాధాన్యం ఇస్తుందని వివరించారు. రామ్ మందిర్ నిర్మాణంపై యువతలో అవగాహన కల్పిస్తామన్నారు.
సరయూ నది పరిసరాల్లో మసీదు నిర్మించుకోవడానికి వక్ఫ్ బోర్డుకు స్థలం కేటాయించాలని, రామ మందిర పరిసరాలను దేవాలయ నిర్మాణానికే పూర్తిగా వదిలేసేలా ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు.