పాక్ నడ్డివిరిచేందుకు త్రిముఖ వ్యూహం: సుబ్రహ్మణ్మ స్వామి
పాక్ పైశాచికత్వానికి విరుగుడుగా ఆ దేశం నడ్డివిరిచేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్మ స్వామి మంగళవారం వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: కృష్ణఘాటి దాడిలో పాక్ పైశాచికత్వానికి విరుగుడుగా ఆ దేశం నడ్డివిరిచేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్మ స్వామి మంగళవారం వ్యాఖ్యానించారు.
వాణిజ్యపరంగా అత్యంత అనుకూల దేశం (ఎంఎఫ్ఎన్) వంటి క్లాజ్ కారణంగా ఇస్లామాబాద్ ఎలాంటి అనుమతి లేకుండా భారత సరిహద్దుల్లోకి ప్రవేశిస్తోందని, ఎంఎఫ్ఎన్ క్లాజ్ ను వెంటనే తొలగించాలని ఆయన సూచించారు.
'మనం స్పందించడం లేదనే అభిప్రాయం వారికి కలగకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మన వ్యూహాన్ని మూడు భాగాలుగా విభజించాలి. ఒకటి తక్షణ చర్య, రెండవది స్వల్పకాలిక చర్య, మూడవది దీర్ఘకాలిక చర్య' అని స్వామి మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
స్వల్పకాలిక చర్యగా జమాత్ ఉద్ దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ ముహమ్మద్ సయీద్ ఉంటున్న శిబిరంతో సహా 42 క్యాంప్లను టార్గెట్ చేయాలని సూచించారు. దీర్ఘకాలిక చర్యగా పాకిస్తాన్ ను నాలుగు దేశాలుగా విడగొట్టాలని సుబ్రహ్మణ్మ స్వామి అన్నారు.
బలూచిస్థాన్తో ప్రారంభించి, దానిని ప్రత్యేక దేశంగా గుర్తించాలని, అక్కడ మానవహక్కుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. 'దావూద్ నివాసంపై బాంబింగ్ జరపాలి. సర్జికల్ దాడులకు అర్ధం లేకుండా పోయింది. రెండు నెలల శాంతి తర్వాత మళ్లీ పరిస్థితి మామూలే అవుతోంది' అని ఆయన అన్నారు.
పాకిస్తాన్ రాయబార కార్యాలయాలను కూడా మూసివేయాలని సూచించారు. ఢిల్లీలో పాక్ ఎంబసీకి చెందిన 1,000 మంది, ముంబైలో 300 మంది సిబ్బంది ఉన్నారని, వీరంతా ఐఎస్ఐ రిక్రూట్ చేసిన వారని స్వామి అభిప్రాయపడ్డారు. అలాగే పాకిస్తాన్ క్యాంపులపై బాంబింగ్ జరపాలని, పరిణామాలు ఎలాంటివైనా అందుకు భారత్ సిద్ధంగా ఉండాలని సుబ్రహ్మణ్మ స్వామి తేల్చిచెప్పారు.